మంచు లక్ష్మి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెల్సిందే.తాజాగా మంచు లక్ష్మి ‘బుడుగు’ సినిమాలో నటించింది.
ప్రస్తుతం ‘బుడుగు’ వివాదం ఫిల్మ్ సర్కిల్స్లో దుమారం రేపుతోంది.ఈ సినిమా నిర్మాతను మంచు లక్ష్మి నానా తిప్పలు పెట్టిందని, రెండు నెలల్లో పూర్తి చేయాలనుకున్న సినిమాను సంవత్సరం అయ్యేలా చేసి, నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు కలిగేలా చేసిందని విమర్శలు వస్తున్నాయి.
ఇక తాను నిర్మించిన ‘దొంగాట’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా డిమాండ్ చేసిందని, అందుకు నిర్మాత ఒప్పుకోక పోవడంతో పలు ఇబ్బందులు సృష్టించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంచు లక్ష్మి ఇచ్చిన డేట్లకు సరిగా పని చేయలేదని, అదనంగా నాలుగు రోజులు షూటింగ్లో పాల్గొన్నందుకు ఏకంగా అయిదు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది అంటూ నిర్మాత సన్నిహితుల వద్ద చెబుతూ వాపోతున్నాడు.
అయిదు లక్షలు ఇస్తేనే డబ్బింగ్ చెప్తాను అని, అలా కాని పక్షంలో సినిమాకు తనకు సంబంధం లేదు అంటూ భయపెట్టిందట.సినిమా విడుదల అయిన తర్వాత అయిదు లక్షలు ఇస్తామని నిర్మాత బతిమిలాడినా కూడా మంచు లక్ష్మి తగ్గలేదని, అందుకు బదులుగా శాటిలైట్ రైట్స్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట.
నిర్మాత ఎలాగోలా ఆ అయిదు లక్షలు ఇచ్చి డబ్బింగ్ చెప్పించాడట.ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా చిత్ర నిర్మాత కోరినా కూడా అందుకు మంచు లక్ష్మి రాలేదని అంటున్నారు.
మొత్తానికి ‘బుడుగు’ నిర్మాతకు మంచు లక్ష్మి చుక్కలు చూపింది అంటూ గుసగులు వినిపిస్తున్నాయి.