ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రముఖ భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్దీఖి శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్లో చీఫ్ ఫొటోగ్రాఫర్గా విధులు నిర్వర్తిస్తున్న సిద్దీఖి.
అఫ్గన్ సైన్యం, తాలిబన్ల మధ్య సాగుతున్న పోరాటాన్ని కవర్ చేస్తున్నారు.అందులో భాగంగానే కాందహార్లోని స్పిన్ బోల్డక్కు అఫ్గాన్ దళాలతో కలిసి వెళ్లారు.
పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతాన్ని ఇటీవల తాలిబన్లు ఆక్రమించుకున్నారు.ఈ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సిద్దీఖి సహా అఫ్గన్ సైన్యానికి చెందిన ఓ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
రోహింగ్యా శరణార్థులపై తీసిన ఫొటోలకు ప్రతిష్ఠాత్మక ‘పులిట్జర్’ అవార్డును అందుకున్నారు.సిద్దీఖి హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది.
దేశ, విదేశాల్లోని జర్నలిస్ట్లు, పాత్రికేయ సంఘాలు సైతం ఆయన మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.గత రెండు రోజులుగా డానిష్పై జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తుండటంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆయనపై చర్చ జరుగుతోంది.
అయితే డానీష్ ఒక్కరే కాకుండా గతంలో యుద్ధాన్ని కవర్ చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్లు ఎందరో వున్నారు.వారిలో భారతీయులు కూడా వున్నారు.
ఈ కోవలో 33 ఏళ్ల రామ్రఖా ఒకరు.భారతీయ సంతతికి చెందిన ఈయన 1968లో నైజీరియా సైనికులు- బియాఫ్రాన్ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న కాల్పులను కవర్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.
రామ్రఖా తన కెమెరాతో ఫోటోలు తీస్తుండగా.అతనిపై తూటాల వర్షం కురిసింది.అతని చివరి క్షణాలను సీబీఎస్ బృందం చిత్రీకరించింది.అందులో తూటాలు అతని శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లగా.
కెమెరా నేలపై పడింది.ఇదే సమయంలో సీబీఎస్ కరస్పాండెంట్ మోర్లే సేఫర్ అతనిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అయితే ఆ సమయంలో ఆయన తీసిన ఫోటోలను 40 ఏళ్ల తర్వాత 2018లో నైరోబీ గ్యారేజ్లో దొరికాయి.వాటిని సేకరించి ‘‘ ప్రియా రామ్రఖా: ది రికవర్డ్ ఆర్కైవ్’’ అనే పుస్తకంలో ప్రచురించారు.జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన రామ్రఖా ఆఫ్రికాలోని వలస వ్యతిరేక పోరాటాలను వెలుగులోకి తీసుకొచ్చారు.1950 నుంచి 1960 వరకు ఆఫ్రికా ఖండంలో జరిగిన కీలకమైన ఉద్యమాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు.
ఇక మరో వ్యక్తి 37 ఏళ్ల నజ్ముల్ హసన్ ఆగస్టు 11, 1983లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో మరణించాడు.ది బారన్ కథనం ప్రకారం.ఆగస్ట్ 8, 1983న ఇరాన్-ఇరాక్ యుద్ధం అప్పటికి నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించింది.టెహ్రాన్కు చెందిన కరస్పాండెంట్ సెలవులో వుండటంతో అతని స్థానంలో విధులు నిర్వర్తించేందుకు నజ్ముల్ హసన్ ఢిల్లీ నుంచి ఇరాన్ వచ్చారు.
మూడు రోజుల తర్వాత పశ్చిమ ఇరాన్లోని యుద్ధరంగంలో పర్యటించడానికి జర్నలిస్ట్ల బృందంతో కలిసి వెళ్లాడు.ఈ క్రమంలో ఓ ప్రాంతంలో ల్యాండ్మైన్ పేలడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో నజ్ముల్తో పాటు ఇరాన్ అధికారి ప్రాణాలు కోల్పోగా.పదుల సంఖ్యలో పాత్రికేయులు గాయపడ్డారు.
అనంతరం ఇరాన్ ప్రభుత్వం.హసన్ భౌతికకాయాన్ని భారత్కు పంపింది.
ఆయనకు భార్య బార్భరా, ఇద్దరు పిల్లలు వున్నారు.
రాయిటర్స్లో సుమారు 67 నెలల పాటు పనిచేసిన హసన్.ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ జోక్యం, శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు, నేపాల్, బంగ్లాదేశ్లతో పాటు ఈశాన్య భారత్లోని అస్సాంలో జరిగిన రాజకీయ తిరుగుబాటును కవర్ చేశారు.1984లో నజ్ముల్ హసన్ జ్ఞాపకార్ధం లండన్లో ఒక స్మారక ఫలకాన్ని రాయిటర్స్ ఆవిష్కరించింది.ఆయన పేరిట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెలోషిప్ను ఏర్పాటు చేశారు.నజ్ముల్ భార్య బార్బరాను రాయిటర్స్ బ్యూరో లైబ్రేరియన్గా ఆ సంస్థ నియమించింది.