వృథావుతున్న ఉపాధిహామీ పనులు,నిధులు

సూర్యాపేట జిల్లా:ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్తులకు పని దినాలు కల్పించాల్సిన విషయాన్ని విస్మరించి,గ్రామ చెరువులో మట్టిని స్థానిక రైతులకు ఉపయోగించుకునే అంశాన్ని తుంగలో తొక్కి,పక్క గ్రామ ప్రజలతో చెరువు మట్టిని తవ్విస్తూ నిరుపయోగమైన పనిని చేపిస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న అధికారుల తీరుతో గ్రామ ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం ఉయ్యాలవాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఊర చెరువులో సారవంతమైన రేగడి మట్టిని,పక్క గ్రామమైన కుంచమర్తి గ్రామ ప్రజలతో ఉపాధి హామీ పనులు చేపిస్తున్నారు.

అందులో వెళ్లిన మట్టిని ఉయ్యాలవాడ గ్రామ రైతుల పొలాల్లోకి తరలించే అవకాశం ఉన్నప్పటికీ చేరువులోనే పక్కకు పోయిస్తూ సారవంతమైన మట్టిని వృథా చేస్తున్నారు.ఇదే విషయమై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గత వేసవిలో కూడా ఇదే విధంగా చెరువు మట్టిని చేరువులోనే పోయించి రైతులకు ఉపయోగ పడకుండా అధికారులు వృథా చేశారని,మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు.

ఉయ్యాలవాడ గ్రామ ప్రజలకు ఉపాధి హామి పని లేకుండా ఖాళీగా ఉంటే,ఉయ్యాలవాడ రెవిన్యూ పరిధిలోని ఊర చెరువులో శివారు గ్రామమైన కుంచమర్తి ప్రజలచేత పని చేయించడం ఏమిటని ప్రశ్నించారు.సొసైటీకి కింద ఉన్న చెరువులో ఎక్కడ పడితే అక్కడ గుంటలు పెట్టి మట్టిని తవ్వుతున్నారని,దీని వలన చెరువు దెబ్బతింటుందని అన్నారు.

గ్రామ ప్రజలతో కాకుండా, శివారు గ్రామ ప్రజలతో పని చేపిస్తూ,మట్టిని రైతులకు ఉపయోగపడకుండా వృథాగా పనులు చేయించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరికీ ఉపయోగపడని వృథా పనులకు బిల్లులు ఎలా పాస్ చేస్తారని వాపోయారు.

Advertisement

ఒక ఊరి వాళ్లు వేరే ఊరికి వచ్చి ఉపాధి హామీ పనులు చేసే అవకాశం ఉంటుంది కానీ,తమ గ్రామ చెరువులో తాము పని చేసే అవకాశం లేదా అని ప్రశ్నించారు.ఎన్ని సార్లు అధికారులకు మొర పెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు.

తమ గ్రామ రెవిన్యూ శివారు ఊర చెరువులో తామే ఉపాధి హామీ పనులు చేసుకుంటామని అన్నారు.ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తమకు ఉపాధి హామీ పనులు కల్పించాలని,ఉయ్యాలవాడ చెరువులో కుంచమర్తి గ్రామ ప్రజలు చేస్తున్న ఉపాధిహామీ పని చేయకుండా తక్షణమే బంద్ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Latest Suryapet News