ఏపీ సీఎం జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాను ఏదైనా వ్యవహారాన్ని తేల్చేస్తే అది పూర్తిగా తేలే వరకు ఒక పట్టాన వదిలి పెట్టరు.
మొదటి నుంచి ఇదే వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు.ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని విషయంలో జగన్ మొండి పట్టుదలతో ముందుకు వెళ్లారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ఎంపిక చేసిన అమరావతి లో ఎట్టి పరిస్థితుల్లోను రాజధానిని నిర్మించేది లేదంటూ ప్రకటిస్తూనే, మూడు రాజధానుల ప్రకటన చేశారు.ప్రధానంగా టీడీపీ అనుకూల వ్యక్తులకు మాత్రమే అమరావతి వల్ల లబ్ధి చేకూరుతుందని, గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని జగన్ బలంగా నమ్ముతూ వచ్చారు.
మొన్నటి వరకు అమరావతి వ్యవహారం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరిగి పోవడంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగినట్టుగా కనిపించింది.
కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.
![Telugu Amaravathi, Ap Amaravathi, Ap, Jagan, Tdp Estate-Political Telugu Amaravathi, Ap Amaravathi, Ap, Jagan, Tdp Estate-Political](https://telugustop.com/wp-content/uploads/2020/05/CBI-Involve-In-AP-Capitam-Amaravathi-Land-Issue.jpg)
విశాఖలో పరిపాలన రాజధానికి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టే పనిలో ఉంటూనే, అమరావతి ప్రాంతంలో రాజధాని భూముల వ్యవహారంలో చోటు చేసుకున్న అవినీతిని వెలికితీసేందుకు సిద్ధమయ్యారు.రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల్లో, సుమారు నాలుగు వేల ఎకరాల్లో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ మొదటి నుంచి అనుమానిస్తూనే వస్తోంది.ముఖ్యంగా టీడీపీ కీలక నాయకులు ఈ వ్యవహారాల్లో భారీగా లబ్ధి పొందారని భావిస్తోంది.
దీనిలో భాగంగానే ఆ నాలుగు వేల ఎకరాల భూములు అవకతవకలపై సమగ్రంగా విచారణ చేయించేందుకు సీబీఐని రంగంలోకి దించబోటన్నట్టు సమాచారం.దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా జగన్ నియమించారు.
![Telugu Amaravathi, Ap Amaravathi, Ap, Jagan, Tdp Estate-Political Telugu Amaravathi, Ap Amaravathi, Ap, Jagan, Tdp Estate-Political](https://telugustop.com/wp-content/uploads/2020/05/CBI-Involve-In-AP-Capitam-Amaravathi-Land-Issue-AP.jpg)
రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.దీని ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న నిరుపేద దళిత రైతులను భయపెట్టి, వారి భూములను గత ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు స్వాహా చేసినట్లుగా కూడా ప్రభుత్వం నమ్ముతోంది.అందుకే ఈ వ్యవహారంలో సీబీఐ తో సమగ్రంగా దర్యాప్తు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దం అయ్యింది.
మరికొద్ది రోజుల్లో సీబీఐ రంగంలోకి దిగి నిజాలను నిగ్గు తేల్చేందుకు సిద్ధం అవుతోందట.