సంక్రాంతి పండుగ అంటేనే సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకుంటారు.ఈ పండుగను చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రజలు సైతం సొంత గ్రామాలకు చేరుకుని ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.
మూడు రోజుల పాటు జరిగే పండుగలను భోగి, సంక్రాంతి, కనుమ అని జరుపుకుంటారు. ధనుర్మాసానికి చివరి రోజు వచ్చే పండుగను భోగి అని పిలుస్తారు.
ఈ భోగి రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉదయం నిద్రలేచి ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసి భోగి మంటలు వేసుకుంటారు.ఈ భోగి భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని అందరి విశ్వాసం.
ఈ సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అంటేనే కోడిపుంజుల ప్రత్యేకం.ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో జరిగే సంక్రాంతి వేడుకలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు.దాదాపు రెండు నెలల ముందు నుంచి ఎక్కడ ఉన్నా హోటల్స్ బుక్ చేసుకోవడం విశేషం.
ఇంత ఆనందంగా జరుపుకునే ఈ భోగి పండుగను కొన్ని గ్రామాలలో నిర్వహించుకుంటే అరిష్టం జరుగుతుందని భావిస్తారు.అయితే ఆ గ్రామాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం
సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే ఈ విజయనగరం జిల్లాలో కొన్ని గ్రామాలలో భోగి పండుగను నిర్వహించుకోరు.అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ పల్లెలలో ఇప్పటికీ కూడా భోగి పండుగను జరుపుకోరు.ఆ గ్రామంలో నివసించే ఈ తరం పిల్లలకు సైతం భోగి పండుగ విశిష్టత, జరుపుకోవడానికి గల కారణాలు అనే విషయాల గురించి అస్సలు అవగాహన ఉండదు.
ఇతర పల్లెల్లో ఉన్న ఆనందం, కోలాహలం, యువత ఉత్సాహం ఆ పల్లెలలో కనిపించవు.ఆ పల్లెలు ఏవంటే.తెర్లాం మండలం తమ్మయ్య వలస,కుమ్మరిపేట గ్రామం, బలిజపేట మండలంలోని సుభద్ర పంచాయతీ పరిధిలోని బడేవలస గ్రామం,రామభద్రపురం మండలం తారాపురం, బాడంగి మండలం పిన్నవలస, ముగడ గ్రామాల్లో కూడా భోగి పండుగను జరుపుకోరు.పూర్వకాలం ఈ గ్రామాలు భోగిమంటలు వేసుకున్నప్పుడు ఆ ఊరిలో ప్రాణనష్టం,కొన్ని ప్రమాదాలు జరగటం వల్ల అప్పటి నుంచి ఆ గ్రామాలలో భోగి పండుగను జరుపుకోరని, ఒకవేళ జరుపుకోవాలని భావించిన ఆ గ్రామానికి ఏదైనా అరిష్టం జరుగుతుందనే భయం వల్ల ఇప్పటికీ ఈ గ్రామాలలో భోగి పండుగను జరుపుకోరు.