తెలంగాణలో మరోసారి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు హస్తినలో అమిత్ షాతో భేటీ అయ్యారు.
సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని పార్టీ నేతలతో అమిత్ షా అన్నట్లు సమాచారం.దీంతో ముందస్తు ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
అసలే కేంద్ర హోంమంత్రి… ఆమాత్రం సమాచారం లేకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయరు.కాబట్టి అమిత్ షా మాటలను కొట్టిపారేయలేం.ఒక వేళా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే.ఏ పార్టీకి లాభం? ఎవరికి నష్టం జరుగుతుందో అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ విజయం సాధించారు.మొదటి దఫా పరిపాలనలో కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయడంతో రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.
అయితే అనంతరం జరిగిన పలు ఉప ఎన్నికల్లో (దుబ్బాక, హుజూరాబాద్) అధికార టీఆర్ఎస్ ఓటమిపాలైంది.దీంతో కేసీఆర్పై ప్రజా వ్యతిరేకత మొదలైందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు.అయితే ఈ పథకం కేవలం ఒక్క నియోజకవర్గంలో కూడా పూర్తిగా అమలు కాలేదు.
దీంతో దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసిన తరువాతనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందన్న వాదన రాజకీయంగా వినిపిస్తోంది.

ఒక వేళా దళిత బంధును అమలు చేయాలన్న ప్రస్తుతానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదు.దీంతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.ఆ లెక్కన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఛాన్స్ కూడా తక్కువే.ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే.ముందస్తు ఎన్నికలు జరగాలనే కోరుకుంటున్నాయి.ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన హామీల్లో పూర్తి స్థాయిలో అమలు కాలేదు.దీంతో సీఎంపై ప్రజా వ్యతిరేకత ఉందని.
ఎన్నికలు జరిగితే కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్న భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయి.