సూర్యాపేట జిల్లా: భారీ వర్షాలు,వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు,అలాగే పశువులు చనిపోతే రూ.
50 వేలు,మేకలు, గొర్రెలు చనిపోతే రూ.5 వేలు యజమానులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు,వరదల వల్ల జరిగిన నష్టం,అనంతర పరిస్థితులపై సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతె మండల పరిధిలోని నామవరం స్టేజ్ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు,జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత నెల30,31,ఈ నెల 1న కురిసిన వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో 30 సెంటీ మీటర్ల పైగా వర్షపాతం నమోదై పెద్ద ఎత్తున పంట,ఆస్తి,ప్రాణ నష్టం జరిగాయని,ఇది బాధాకరమన్నారు.పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, ఇండ్లు కూలిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పూర్తి నష్ట పరిహారం ఇస్తామని,అలాగే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు సైతం నిర్మించి ఇస్తామని,భారీ వర్షాలు, వరదల తక్షణ సహాయక చర్యలకు గాను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు రూ.5 కోట్లు ముందే మంజూరు చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందని,జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు ఆ నిధులను సహాయక చర్యలకు వినియోగించవచ్చని తెలిపారు.స్థానిక విపత్కర పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్లకే ఇచ్చామని, అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా సూర్యాపేట జిల్లాలో 21 చెరువులు తెగిపోయాయని,15 గ్రామాల నుండి 420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని,20 వేల ఎకరాలలో పంట నీట మునిగిందని,7 పశువులు చనిపోగా,7 పక్కా,33 కచ్చా ఇండ్లు కూలిపోయాయని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సైతం వర్షాలకు దెబ్బతినగా దానిని పునరుద్ధరించే చర్యలు చేపడతామని, తుంగతుర్తిలో సైతం పశువులు చనిపోయాయని,చెక్ డ్యాములు తెగిపోయినట్లు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు.
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలను సంపూర్ణంగా ఆదుకొని వారికి విశ్వాసం కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లాల్లో సమీక్షకు వచ్చినట్లు తెలిపారు.ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయడమే కాకుండా, ప్రజాప్రతినిధులు,అధికారుల సమన్వయంతో ప్రజలకు సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ,డిజిపి,ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే తక్షణమే పునరుద్దిస్తున్నామని,అలాగే వరదల,వర్షాల వల్ల దెబ్బతిన్న జిల్లాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నామని, భారీ వర్షాలు,వరదలలో ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందచేస్తున్న జిల్లా యంత్రంగాలు,మంత్రులు, ప్రజాప్రతినిధులను అభినందించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సహకారం అందించాలని ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి,అలాగే రాహుల్ గాంధీని సైతం కోరామని, వారు సంపూర్ణ సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు.
విపత్కర పరిస్థితులలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరదల వల్ల నష్టపోయిన ప్రజల సహాయార్థం సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఎవరైనా సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.ప్రతిపక్షాలు సైతం రాజకీయాలకతీతంగా ప్రస్తుత తరుణంలో ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు.
తాను గడచిన మూడు రోజులుగా కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే ఉండి ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు.వరదలు,విపత్తులు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ కోసం కేంద్రం వైపు చూడాల్సి వస్తుందని,దీనిని అధిగమించేందుకుగాను రాష్ట్రంలోనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సును (SDRF) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో ఎనిమిది బృందాలు ఉంటాయని, ఒక్కో బృందంలో వందమంది చొప్పున స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని,ఈ బృందాలను స్పెషల్ బెటాలియన్లు ఉన్నచోట ఉంచి ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే అక్కడ ఆదుకునేందుకు పంపించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో తలెత్తిన వరదలు,భారీ వర్షాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రిని కోరినట్లు వెల్లడించారు.అలాగే భారీ వర్షాలు,వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా రూ.5000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనాకు రావడం జరిగిందని,అందువల్ల వెంటనే రూ.5000 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని, పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు.తక్షణమే కనీసం రెండువేల కోట్ల అయినా విడుదల చేయించే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజీయ్ కృషి చేయాలని కోరారు.
ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, అంతేకాక అధికారులను సైతం పూర్తిస్థాయిలో అండగా ఉంటారని తెలిపారు.భారీ వర్షాలు, వరదల నుండి ప్రజలు కోలుకునేందుకు అధికారులు ఇంకా బాగా బాధ్యతగా పనిచేయాలని,ప్రజలలోనే ఉండాలని,ప్రజలను ఆదుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజాప్రతినిధులతో పాటు, యావత్తు యంత్రాంగం ప్రజలకు వరద సహాయక చర్యలను చేపట్టి రుజువు చేసిందని తెలిపారు.అధికారులు అద్భుతంగా పనిచేస్తూ ముందుకెళుతున్నారని, సూర్యాపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
అంతేకాక చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,నీట మునిగిన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని,గృహాలు కోల్పోయిన వారికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు,వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులతో పాటు,ఇండ్లు కోల్పోయినవారు, ఇతరులకు అండగా ఉంటామని,ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు.అధికారుల నివేదిక ప్రకారం సూర్యాపేట జిల్లాలో 11 రోడ్లు తేగిపోయాయని వాటన్నిటికి మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించడం జరిగిందని, ప్రాథమిక నివేదిక ప్రకారం ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు అవసరమవుతాయని,వర్షాలు తగ్గిన వెంటనే రహదారుల రిపేర్లను చేపడతామని చెప్పారు.తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడం జరిగిందని, వరదలు వలన పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇస్తామని తెలిపారు.
ఆర్ అండ్ బి రహదారులతో పాటు పంచాయతీ రోడ్లను పునరుద్ధరిస్తామని, అధికారులు,ప్రజాప్రతినిధులు కలిసి పేదలకు, రైతులకు అండగా నిలబడాలని,ఇందుకు ఎవరు సెలవుపై వెళ్లకుండా 24 గంటలు పని చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాలలో గడచిన మూడు రోజుల కురిసిన భారీ వర్షాల వర్షపాతం వివరాలను,నష్టాన్ని తెలియజేశారు.
ప్రాణ నష్టం తగ్గించేందుకుగాను, ప్రతి గ్రామంలో ముందే బృందాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, అందువల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదని, ఇంకా 5 పునరావాస క్యాంపులను నిర్వహిస్తున్నామని,రహదారులు తెగిపోయి రవాణాకు ఇబ్బంది ఏర్పడిన చోట,విద్యుత్తు, తాగునీరు వంటి ఇబ్బందులు కలిగిన చోట పునరుద్ధరణ చర్యలను చేపట్టడం జరిగిందని, ఆయా శాఖల వారిగా పూర్తి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వర్షాల వల్ల కోదాడ,ఇతర ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నవారి దుకాణాలు,ఇండ్లు మునిగిపోయాయని,వర్షాల కారణంగా పడిపోయిన ఇండ్లు కోల్పోయిన వారికి సహకారం అందించాలని, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు సహాయం అందించాలని,వారికి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని, కోదాడ మున్సిపాలిటీలో ఎలాంటి నిధులు లేనందున దెబ్బతిన్న రోడ్లు ఇతర మరమ్మతులు చేపట్టేందుకు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 670 చెరువులు తెగిపోయాయని, తెగిపోయిన చెరువులకు మరమ్మతులు చేపట్టాలని,అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy