బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం:మంత్రి జగదీష్ రెడ్డి

8వందల సంవత్సరాల క్రితమే సమాజంలో కుల, వర్ణ,లింగ బేధాలు లేవని అందరూ సమానమేనని చాటి చెప్పిన ప్రముఖుడు బసవేశ్వరుడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

ఆదివారం మహాత్మా బసవేశ్వర 890జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యాతిధిగా హాజరై బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థను,వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయవాది బసవేశ్వర స్వామి అని కొనియాడారు.అభ్యుదయవాది,వీర‌శైవ మ‌త స్థాప‌కుడు మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌రుని జ‌యంతి వేడుక‌లను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వ‌హిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్లప్పుడూ స‌మ‌స‌మాజ స్థాప‌న‌కు పాటుప‌డిన వారిని స్మ‌రిస్తూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతుందని తెలిపారు.బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకరని, కుల‌,మ‌త భేదాలు లేని స‌మాజ స్థాప‌న‌కే కృషి చేసిన గొప్ప సంఘ సంస్క‌ర్తని గుర్తు చేశారు.

మ‌నుషులంద‌రూ ఒక్క‌టే, కులాలు,ఉప‌కులాలు లేవ‌న్న మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌రుని ఉప‌దేశాన్ని ప్ర‌జ‌లంద‌రూ గుర్తుంచుకోవాల‌న్నారు.ప్రతి ఒక్కరూ మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌రుడు చూపిన మార్గంలో న‌డవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంత‌గానో ఉంద‌ని,అలా నడవడమే, మ‌నం ఆయ‌న‌కిచ్చే నిజ‌మైన నివాళి అని అన్నారు.

Advertisement

ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని వారు చేసిన సేవలను పోరాటాలను తెలిపారు.లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ వారి సభ్యులు కోరిన రుద్రభూమి,బసవ భవన నిర్మాణం అలాగే ఆ ప్రాంగణంలో బసవేశ్వర విగ్రహ ఏర్పాట్లు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

సమావేశం మందిరంలో ఉన్న సంఘ సభ్యులు అందరూ మంత్రి ఇచ్చిన వాగ్దానానికి అందరూ నిలబడి కరతాల ధ్వనులతో మంత్రికి తమ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.మోహన్ రావు, డిఆర్ఓ రాజేంద్ర కుమార్, లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు ఎస్.చంద్రశేఖర్,గౌరవాధ్యక్షులు ఎస్ఎస్ సోమయ్య, కార్యదర్శి పి.శేఖర్, కోశాధికారి డి.శ్రీనివాస్, జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News