జప=వ్యక్తాయాం వాచి అనే ధాతువు నుండి జప శబ్దం పుట్టింది.వ్యక్తమైన మాటను జపం అంటారు.
ఈ పదం ముఖ్యంగా మంత్రాలను జపించడంలో ఉపయోగిస్తారు.ముముక్షువులు, అంటే మోక్షాన్ని అభిలషించేవారు తమ మనస్సును నిగ్రహించడానికి జపాన్ని సాధన చేస్తారు.
సప్త కోటి మహా మంత్రాలలో ఏ మంత్రంం అయినా జపించవచ్చు.మననం చేసే వారిని రక్షించేదే మంత్రం.
అందులో రామ తారకం, శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, ప్రణవం, ఇవి అతి ముఖ్యమైన మంత్రాలు.ప్రణవ జపాన్ని వివరిస్తూ పతంజలి ‘తజ్ఞపస్త దర్ధభావనమ్’ అని చెప్పాడు.
పరమాత్మకు వాచకమైన ఓంకారాన్ని జపించే సమయంలో ఓంకారాని కర్ధమైన పరమాత్మను గూడా భావించాలి.ఇతర మంత్రాల జపంలో కూడా ఈ పద్ధతిని పాటించాలి.
పైకి వినబడేటట్లు ఉచ్చరిస్తూ చేసే జపం వాచికం.పెదవుల కదలికతో తక్కువ స్వరంతో చేసేది ఉపాంశు జపం.మనస్సుతో చేసేది మానస జపమని అంటారు.వచనాన్నిబట్టి కోటి మంత్రజపం ఒక్క ధ్యానంతో సమానం.
తత్రప్రత్యయైకతానతా ధ్యానం అని యోగశాస్త్రం ధ్యానాన్ని నిర్వచించింది.ఏదైనా ఒక చోట ఇతర విషయాలతో సంబంధం లేకుండా చిత్తం సంలగ్నం కావడాన్ని ధ్యానం అంటారు.
శ్వాసమీద మాత్రమే ధ్యాస నిలిపే ప్రక్రియను కూడా ధ్యానం అంటారు.ధ్యానంతో సమమైన సగుణమనీ, నిర్గుణమనీ ప్రధానంగా రెండు విధాలు ఉంటాయి.
నిర్గుణమైన పరమాత్మను ధ్యానించడం కష్టం.కాన సగుణ ధ్యానం చేసి అది పరిపక్వత పొందిన తరువాత నిర్గుణ ధ్యానం చేయవచ్చు.
సగుణ ధ్యాన హీనస్య, నహి నిర్గుణవేదనమ్ అనడంలో అంతర్యం ఇదే.అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ధ్యాన విధానం గురించి వివరంగా చెప్పారు.యోగశాస్త్రం కూడా ధ్యానాన్ని నిరూపించింది.