దళిత బంధును అధికారుల ద్వారా పంపిణీ చేయాలి

సూర్యాపేట జిల్లా:దళిత బంధును రాష్ట్ర వ్యాపితంగా చిత్తశుద్ధితో అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు విమర్శించారు.

బుధవారం రాష్ట్ర వ్యాపితంగా దళితులందరికి దళిత బంధును అమలు చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకెఎంఎస్) రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గత 75 సంవత్సరాలలో షెడ్యూల్ కులముల ఓట్ల కోసమే సంక్షేమ పథకాల ప్రకటనలు చేస్తున్నారు తప్ప, అమలు చేయడం లేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాని కంటే ముందు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ నాటి నుండి దళితులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎస్సీ సబ్ ప్లాన్,ఎస్సీ,ఎస్టీ యాక్ట్,ఎస్సి రిజర్వేషన్ వివిధ సంక్షేమ పథకాలతో సహా దళిత బంధు పథకం కూడా సరిగా అమలు చేయడం లేదన్నారు.రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఇవ్వడానికి దళిత బంధు పథకంకు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించి కనీసం పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని అన్నారు.

దళితులకు 3 ఎకరాల భూమి 15 శాతం కూడా ఇవ్వలేదని అన్నారు.ఎస్సీ సబ్ ప్లాన్ 2014 -15 సంవత్సరంలో 4576.50 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే 20602.73 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని సగానికిపైగా ఖర్చు చేయకుండా కేటాయించిన బడ్జెట్ లో మిగిలించారని,మిగిలిన ఆ బడ్జెట్ ను వచ్చే సంవత్సరం బడ్జెట్ లో కలపలేదని అన్నారు.ఇందిర జల పథకం,డ్రిప్ తదితర పథకాలు కూడా దళితుల పేరుతో ఇతరులు కైవసం చేసుకున్నరని అన్నారు.

Advertisement

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ప్రాజెక్టులకు, రహదారులకు,రోడ్లకు ఇతర వాటికి నిధులు మళ్లించారని అన్నారు.రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు 15 శాతం కూడా అమలు చేయలేదన్నారు.

ఏ సంవత్సరం కూడా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వంద శాతం ఖర్చు చేయలేదని తెలిపారు.కెసిఆర్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన ప్లాట్లను బలవంతంగా గుంజుకొని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసారని ఆరోపించారు.

రాష్ట్రంలో దళిత బంధు అమలు చేసే విధానం సరిగాలేదని, కెసిఆర్ తన జీవిత కాలంలో దీనిని అమలు చేయలేడని ఎద్దేవా చేశారు.దళితులు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇచ్చే అంతవరకు ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు లేవు కానీ,ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తూ ఇతర కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసిందని దుయ్యబట్టారు.దళిత బంధును ఎమ్మెల్యేలు,మంత్రులు టిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయిస్తూ అసలైన అర్హులను విస్మరిస్తున్నారని అన్నారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Pougues Les Eaux : Bonus Et Promotions Expliqués Pour Les Joueurs Avertis

ప్రభుత్వ శాఖ అధికారుల ద్వారా దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సదస్సులో సిపిఐ(ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ మాట్లాడుతూ దళిత బంధు పథకం టిఆర్ఎస్ కార్యకర్తల బంధుగా ఏర్పడిందని అన్నారు.ఈ సదస్సుకు ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య అధ్యక్ష వహించగా,ఏఐకెఎమ్ఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్,పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు,పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు కిరణ్, ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి అలుగుబెల్లి వెంకటరెడ్డి,పీవోడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు కంచెంచర్ల నరసమ్మ తదితరులు ప్రసంగించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు కాకి మోహన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,పివైఎల్ జిల్లా అధ్యక్షులు నలగొండ నాగయ్య,అరుణోదయ జిల్లా నాయకులు తడకమల్ల సంజీవ్,ఎర్ర ఉమేష్,బొల్లే వెంకన్న,సంజీవ్,ధనుంజయ్,వీరబోయిన రమేష్, మిరియాల రమేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News