SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.గాంధీ జయంతి సందర్భంగా ఈ ఆదివారం నాలుగో దశ ‘SBI గ్రామసేవ’ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 30 మారుమూల గ్రామాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించడం విశేషం.కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ‘SBI ఫౌండేషన్’ ఈ ప్రోగ్రామ్ను పర్యవేక్షించనుంది.
ఈ ఫ్లాగ్షిప్ పథకం కింద హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామాలను బ్యాంక్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంది.
ఈ ప్రాజెక్టు నాలుగో దశను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు SBI చైర్మన్ దినేష్ ఖరా.
బలమైన, అభివృద్ధి చెందిన గ్రామీణ భారతాన్ని నిర్మించడానికి SBI ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు.SBI ఫౌండేషన్ నిర్వహిస్తున్న CSR యాక్టివిటీస్లో గ్రామ సేవ ప్రోగ్రామ్ ఈ దిశగా బాటలు వేస్తోందన్నారు.
తాజాగా ఆరు రాష్ట్రాలలోని 30 గ్రామాలను ఈ దశలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా ముందడుగు వేస్తున్నట్లు వెల్లడించారు.
మహాత్మాగాంధీ ‘గ్రామ స్వరాజ్యం’ అనే నినాదాన్ని స్మరించుకుంటూ 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘SBI గ్రామ సేవ’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది.
ఆత్మనిర్భర్ రూరల్ ఇండియా దిశగా మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.SBI గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) విభాగం అయిన SBI ఫౌండేషన్ స్థాపించిన ప్రధాన కార్యక్రమాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి.విద్య , ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో అభివృద్ధి సాధించడం ద్వారా భారతదేశంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయడం కార్యక్రమం లక్ష్యం.
ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా SBI ఫౌండేషన్ భారతదేశంలోని 16 రాష్ట్రాల్లోని 100 గ్రామాలను మూడు దశల్లో దత్తత తీసుకొని అభివృద్ధి చేసింది.