విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు సాగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.ఏడాదిలో తెలిసీ తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా అమ్మవారి పవిత్రోత్సవాలను నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేదోక్తంగా ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.అనంతరం పవిత్రాల పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.
విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్నిప్రతిష్ఠాపన సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించి పవిత్రమాలలను మూలవిరాట్టులకు, దేవతా మూర్తులకు ధరింపచేశారు.అమ్మవారికి సుగంధ పరిమళాలు, పవిత్ర కృష్ణానదీ జలాలతో స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు.దేవతామూర్తులకు ధరింప జేసిన పవిత్రాలను ప్రజలు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం.