మరి కొద్ది రోజులలో కార్తీక మాసం మొదలవుతుంది.కార్తీకమాసం మొదలవగానే భక్తులు పెద్ద ఎత్తున శివాలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుడికి పూజించినచో వారి కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం.కార్తీక మాసంలో ప్రతిరోజూ నిత్యం అభిషేకాలతో, పూజలతో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతుంటాయి.
సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిన విషయమే.కానీ కార్తీక మాసంలో ఏ పదార్థాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
*కార్తీక మాసంలో ఆ శివుడికి మెత్తని చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మన జీవితంలో ఏర్పడినటువంటి దుఃఖము తొలగిపోయి సుఖ సంతోషాలను కలిగి ఉంటారు.
*శివునికి ఎంతో ప్రీతికరమైన దళాలు మారేడు బిల్వ దళాలు.ఈ బిల్వదళ జలము చేత శివుడికి అభిషేకం చేసిన వారికి భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు.
*వివిధ రకాల పుష్పాల చేత స్వామి వారిని అభిషేకించడం వల్ల భూలాభము కలుగును.అంతే కాకుండా తేనెతో అభిషేకం చేయటం ద్వారా వారి జీవితం తేజో వృద్ధిని కలిగి ఉంటుంది.

*కొబ్బరినీళ్ళతో, రుద్రాక్ష జలములతో స్వామివారికి అభిషేకం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
*ఆ పరమేశ్వరుడికి గరిక నీటితో అభిషేకం చేయడం వల్ల మన జీవితంలో నష్టపోయిన ధనాన్ని తిరిగి పొందగలుగుతారు.అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ద్వారా అపమృత్యువును నశింప గలుగుతుంది.
*ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యితో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల బలం, ఆరోగ్యంతో పాటు, సర్వ సౌఖ్యములు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
అలాగే చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల వారి జీవితంలో ధన వృద్ధి కలుగుతుంది.
పై పదార్థాలతో కార్తీకమాసంలో శివుడికి అభిషేకాలు చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేర్చడమే కాకుండా, వారి జీవితంలో సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలను ఆ పరమశివుడు కలిగిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.