బంధాల పట్ల, చేస్తున్న వృత్తి పట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల కృతజ్ఞతా పూర్వకంగా ఉండటమే నిజమైన పూజ.అంతఃకరణ శుద్ధి చేసుకోవడమే నిజమైన సాధన.
సత్కార్యమే నిజమైన సాధన అని అంటారు.ముఖ్యంగా పూజ రెండు రకాలు.
ఒకటి బాహ్య పూజ.మరొకటి అంతర్ పూజ.బాహ్య పూజలో ఎంత సేపూ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అన్న ఆలోచనతో పూజ చేస్తారు.తర్వాత ఆ స్ఫురణ పోయి భగవంతునిపై పూర్తి శరణా గతి ఏర్పడుతుంది.
అప్పుడు కోరికలు కోరడం అనే స్పురణ పోతుంది.అంతర్ పూజ నిరంతరం జరుగుతున్నప్పుడు మాత్రమే నీవు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
కొంత మందికి ఏ పూజ, జపం, సాధన చేయకుండానే ధ్యాన స్థితికి వస్తారు.గత జన్మలో వారి కర్మ పరిపక్వం అయినప్పుడు అసలు ఏ పూజ కూడా చేయాల్సిన అవసరం లేకుండానే నీవు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
భగవంతునికి పూజలు చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.మగవారి విషయంలో నిత్యం తలస్నానంచేసి పూజకు ఉపక్రమించాలి.
ఆడవారు కేవలం శుక్రవారం తలంటుపోసుకోవాలి.మిగిలిన రోజులలో పసుపు నీళ్ళు నెత్తిన చల్లుకోవాలి.
పూజకు ప్రత్యేక వస్త్రం ప్రతి రోజూ ఉతికి ఆరవేసుకోవాలి.పూజకు ఉపక్రమించినది మొదలు పూజ అయ్యేవరకు మనకు కావలసిన సామాగ్రి ప్రక్కనే వుంచుకోవాలి.
పూజ మధ్యలో లేవకూడదు.మనకంటే వున్నత ఆసనంమీద దేవుడు వుండాలి.
పూజా సమయంలో ఇతరులకు నమస్కరించరాదు.మగవారు నుదుటిన బొట్టు లేకుండా, ఆడవారు కుంకుమ, కాళ్ళకు పసుపు లేకుండా పూజ చేయరాదు.