ప్రతి సంవత్సరం 24 ఏకాదశిలు వస్తాయి.సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు.
సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వెయ్యి కళ్ళతో వేచి ఉంటారు.
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు.అందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగి ఉండటం వలన కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు.
సముద్ర మధనం చేసినప్పుడు హాలాహలం, అమృతం రెండూ ముక్కోటి ఏకాదశి నాడు పుట్టాయి.
హాలాహలాన్ని శివుడు మింగాడు.మహా భారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను కూడా ముక్కోటి ఏకాదశి నాడే ఉపదేశం చేసారు.
ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు,హోమాలు, దేవుని ప్రవచనాలు ఉంటాయి.ఈ రోజున భక్తులు ఉపవాసం,జాగరణ,జపం ధ్యానం వంటి చేస్తూ దేవుని ఆరాధనలో గడుపుతారు.
చాలా మంది గీతోపదేశం జరిగిన రోజు కనుక ముక్కోటి ఏకాదశి రోజు ‘భగవద్గీత’ పుస్తకంను దానం చేస్తారు.
ముక్కోటి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి.
కేవలం తులసి తీర్ధం మాత్రమే తీసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
ఈ రోజు అబద్దం ఆడకూడదు.చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.అలాగే అన్నదానం చేయాలి.