భారీ వృక్షాలను కొట్టి...అడ్డదారిలో అమ్మేస్తుండ్రు...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రం నుండి అలింగాపురం వరకు సుమారు రూ.30 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతి రావడంతో పాత రోడ్డుకు ఇరువైపులా పెరిగిన భారీ వృక్షాలను డబుల్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని అనుమతులు లేకుండా ఆర్ అండ్ బి నరికేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ,అటవీ శాఖ అనుమతులు లేకుండా స్థానికులతో చేతులు కలిపి టెండర్ ప్రక్రియ లేకుండానే భారీ వృక్షాలను నరికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సింగిల్ రోడ్లను డబుల్ రొడ్డుగా మార్చాలంటే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన భారీ వృక్షాలను తొలగించక తప్పదు.కానీ, వీటిని తొలగించాలంటే అటవీ శాఖ ఎలివేషన్ అనంతరం పేపర్ ప్రకటనతో చెట్లు నరికేందుకు టెండర్ పిలిచి,ప్రభుత్వ వేలంలో దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎలివేషన్ ప్రకారం చెట్లకు సుమారు రూ.500ల నష్టపరిహారం చెల్లించి అటవీశాఖ అనుమతితో తొలగించాల్సి ఉంటుంది.ఈ రోడ్డు నిర్మాణంలో ఆర్ అండ్ బి అధికారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇప్పటికే 3.4 కైబారం గల చెట్లను అమ్మినట్లు తెలుస్తోంది.టెండర్ ప్రక్రియ ద్వారా ఈ పని జరిగితే ప్రభుత్వానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చేదని అంటున్నారు.అనుమతులపై శనార్తి ప్రతినిధి ఆర్ అండ్ బి ఏఈని వివరణ కోరే ప్రయత్నం చేయగా అన్ని అనుమతులు ఉన్నాయని,కావాలంటే మీకు చెబుతామని చెప్పి,ఆ తర్వాత స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే అటవీ శాఖ అధికారులు మాత్రం మా నుండి ఎటువంటి అనుమతులు పొందలేదని చెపుతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెట్ల నరికివేతపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవడం సులభం
Advertisement

Latest Suryapet News