అప్పు పుట్టకపోతే అంతే సంగతులు:సంకినేని

సూర్యాపేట జిల్లా:కొత్తగా అప్పు పుడితే కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీళ్ళు,నిధులు, నియమకాలు వచ్చింది కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమేనని,కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబానికి బందీ అయిందన్నారు.

తెలంగాణ 8 ఏండ్ల పరిపాలనలో బాగుపడ్డది కేవలం మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రమేనని ఆరోపించారు.రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు చనిపోయాక రైతు బీమా ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని,రైతులకు కావాల్సింది భీమా కాదని మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి భూసార పరీక్షల కొరకు కేంద్రం 250 కోట్లు ఇస్తే నేటికీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వాన్ని టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరిస్తుందని,వడ్ల కొనుగోళ్ల పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని,రూ.1960 మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు.రూ.46వేల కోట్లు మిషన్ భగీరధ పధకానికి ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం,నేటికీ 40 శాతం గ్రామాలకు కూడా మంచినీరు సరఫరా కావడం లేదన్నారు.గతంలో తవ్విన ఎస్సారెస్పీ కాలువల ద్వారానే సాగు నీరు వస్తున్నదని, కాళేశ్వరం ద్వారా కాదని పేర్కొన్నారు.

నేట్టింపాడు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విభజన సమయంలో రూ.5వేల కోట్లు ఉన్న అప్పులు 8 ఏండ్లలో రూ.5 లక్షలకు పెంచారన్నారు.సంక్షేమ పధకాలకు,ఉద్యోగుల జీతాలకు అప్పు పుడితేనే ఇచ్చే పరిస్థితి కల్పిచారన్నారు.8 ఏండ్లలో సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆయన అనుచరులు లాండ్,శాండ్,రియల్ మాఫియాలుగా తయారయ్యారని విమర్శించారు.సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ది పనులు కేంద్ర ప్రభుత్వ నిధులేనని,దీనిపై మంత్రి బహిరంగ చర్చ జరపాలని సవాల్ విసిరారు.

Advertisement
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News