రామాయణంలో రాముడు, లక్ష్మణుడు అన్నదమ్ములుగా ఎంత అన్యోన్యంగా ఉండేవారో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా లక్ష్మణుడు అయితే తన అన్న రాముడికి సేవకుడిలా ఉండేవాడు.
రాముడు ఏం చెప్పినా చేసేవాడు.గీత దాటేవాడు కాదు.
అన్న కోసం 14 ఏళ్లు అరణ్య వాసం చేశాడు.తరువాత సీతమ్మను రక్షించేందుకు రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తే అందులో లక్ష్మణుడు తన వంతుగా అన్నకు సహాయం చేశాడు.
ఇంకా చెప్పాలంటే.లక్ష్మణుడు రాముడికి ఎప్పుడూ అంటి పెట్టుకుని అన్ని సపర్యలు చేసేవాడు.
అయితే మీకు తెలుసా.? లక్ష్మణుడు మరణించేందుకు కారణం రాముడే అని.అవును, మీరు విన్నది నిజమే.దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రాముడు రావణాసురున్ని చంపాక అయోధ్యకు తిరిగి వస్తాడు.ఆ తరువాత ప్రజలంతా సంతోషాలతో ఉంటారు.అనంతరం సీతను మళ్లీ రాముడు విడిచిపెట్టడం, లవకుశులు పుట్టడం, వారు తండ్రి రామున్ని తెలుసుకోవడం, సీత చనిపోవడం, లవకుశులకు యువరాజులుగా పట్టాభిషేకం చేయడం.అన్నీ జరిగిపోతాయి.
ఆ తరువాత ఒక రోజున యముడు వచ్చి రాముడితో ముఖ్యమైన విషయాలను మాట్లాడాలని, తనతో ఏకాంతంగా మాట్లాడాలని, అలా మాట్లాడేటప్పుడు ఎవరూ మధ్యలో ఆటంకం కలిగించకూడదని, తనతో మాట్లాడే విషయాలను ఎవరికీ చెప్పవద్దని యముడు రాముడితో అంటాడు.అందుకు రాముడు అంగీకరిస్తాడు.
ఈ క్రమంలోనే రాముడు తన మందిరానికి కాపలాదారుడిగా లక్ష్మణున్ని నియమిస్తాడు.ఎవరైనా లోపలికి వచ్చి తమకు ఆటంకం కలిగిస్తే వారికి మరణ శిక్ష వేస్తానని రాముడు చెబుతాడు.
ఇందుకు లక్ష్మణుడు సరే అని మందిరం బయట కాపలా ఉంటాడు.

ఆ సమయంలో రాముడు, యముడు ఇద్దరూ మందిరంలో మాట్లాడుకుంటూ ఉంటారు.అదే సమయానికి దుర్వాసుడు అనే మహర్షి అక్కడికి వచ్చి రాముడిని కలవాలంటాడు.అందుకు లక్ష్మణుడు వీలు కాదని చెబుతాడు.
దీంతో దుర్వాసుడు కోపోద్రిక్తుడై అయోధ్యను శపిస్తానని, దాంతో 100 ఏళ్ల వరకు ఆ రాజ్యంలో పంటలు పండవని, కరువు వస్తుందని అంటాడు.అందుకు లక్ష్మణుడు స్పందిస్తూ దుర్వాసున్ని శాంతించమని చెబుతాడు.
తాను మందిరంలోకి వెళ్లి అన్నగారికి విషయం చెబుతానని అంటాడు.అనంతరం లక్ష్మణుడు అలాగే చేస్తాడు.
ఈ క్రమంలో మందిరంలోకి వెళ్లిన లక్ష్మణుడు దుర్వాసుడు వచ్చిన విషయాన్ని రాముడికి చెబుతాడు.ఆ తరువాత మందిరంలోకి వచ్చి ఆటంకం కలిగించినందుకు గాను అన్న అంతకు ముందు చెప్పిన దాని ప్రకారం లక్ష్మణుడు తనకు తానే మరణ శిక్ష వేసుకుంటాడు.
సరయూ నది తీరానికి వెళ్లి తనను తాను ఆత్మత్యాగం చేసుకుంటాడు.అలా లక్ష్మణుడి మరణానికి రాముడు కారణమవుతాడు.