వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రహస్యాలన్నీ బట్టబయలవుతూనే ఉన్నాయి.దీంతో ఆ పార్టీ వ్యూహాలు తలకిందులు అవుతుండటంతో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇది ఒకరకంగా వైసీపీ వైఫల్యమే అనే చెప్పాలి.తాజాగా వైసీపీ సీక్రెట్ వ్యవహారం ముందస్తు ఎన్నికల మేటర్ లీకైనట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి జగన్ సీఎం అయిన నాటి నుంచి ముందస్తు ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం జపం చేస్తూనే ఉంది.జమిలి ఎన్నికలు వస్తాయని అందరూ అభిప్రాయపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు వస్తాయని విశ్వసించారు.వైసీపీ ప్రభుత్వం ఆయష్షు మూడేళ్లు మాత్రమే ఉంటుందని ఆయన అంచనా వేశారు.అందుకే కేబినెట్ను రెండున్నరేళ్లకు చొప్పున రెండుగా విభజించారనే వాదనలు కూడా చోటుచేసుకున్నాయి.అయితే ఏమైందో ఏమో కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం జమిలి ఎన్నికల నుంచి వెనక్కి తగ్గింది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిపోయాయి.
దీంతో జమిలి ఎన్నికలు రావని అందరికీ అర్ధమైపోయింది.
అయితే కొన్నాళ్లకే ఏపీలో అధికార పార్టీ ఎన్నికల విషయంలో దూకుడు పెంచింది.ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా జగన్ జిల్లా పర్యటనలు చేయడంతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజాప్రతినిధులందరూ ప్రజల నాడి తెలుసుకోవాలని పట్టుబట్టారు.
![Telugu Andhra Pradesh, Chandrababu, Cmjagan, Jamili, Janasena, Pawan Kalyan, Ysr Telugu Andhra Pradesh, Chandrababu, Cmjagan, Jamili, Janasena, Pawan Kalyan, Ysr](https://telugustop.com/wp-content/uploads/2022/06/How-did-that-secret-get-leaked-ycp-in-troubles-detailss.jpg)
అది సరిపోదంటూ మంత్రుల చేత బస్సు యాత్ర కూడా చేయించారు.బస్సు యాత్రకు ప్రజాదరణ దక్కిందా లేదా అన్న విషయం పక్కనపెడితే ఇదంతా జగన్ ఎన్నికల వ్యూహమే అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
ఇవన్నీ సంకేతాలుగా కనిపిస్తున్నా ప్రతిపక్షాలు పెద్దగా నమ్మినట్లు కనిపించలేదు.అయితే జనసేనాని సడెన్గా బస్సు యాత్ర చేపట్టడం వైసీపీకి ట్విస్ట్ ఇచ్చారు.మరోవైపు చంద్రబాబుకు కూడా జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు.జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అప్పులు పెరిగిపోవడం, సంక్షేమ పథకాలకు బ్రేక్ పడటం, శాంతిభద్రతలు క్షీణిస్తుండటం లాంటివి జగన్ సర్కారుకు కునుకు లేకుండా చేస్తున్నాయి.అందుకే ఎన్నికలకు త్వరగా వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.