ఇంజనీరింగ్ లోపాలను సవరించి, సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలి : ఎస్పి రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: రోడ్డు భద్రత,ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్ సంస్థ,ఎన్ హెచ్-65 కలిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలతో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80 కిలోమీటర్లు నేషనల్ హైవే 65 విస్తరించి ఉందని,ఈ మార్గం వాణిజ్య రవాణా పరంగా,ఇతర రాష్ట్రాలను కలుపుతూ ఉండడంతో పండుగల సమయంలో హైదరాబాద్- విజయవాడ ప్రయాణాలు, దురాజుపల్లి జాతర,గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇలా నిత్యం రద్దీగా ఉంటుందని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు.

ఈ మార్గంలో ప్రమాదాలకు లోపాలను గుర్తించడం జరిగిందన్నారు.ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయని,ఎక్కడపడితే అక్కడ రోడ్డు మధ్యలో మార్గాలు తెరిచారని,గ్రామాల నుండి వచ్చే లింక్ రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, సర్వీస్ రోడ్లు పూర్తి కాలేదని గ్రామాల వద్ద సూచిక బోర్డ్స్ పై అవగాహన లోపం ఉన్నదని, చాలా జంక్షన్ ల వద్ద ఫ్లై ఓవర్స్ అవసరం ఉన్నదని,పాసెజ్ లు హైట్ కూడా తక్కువ ఉండడం వల్ల పెద్ద వాహనాలు వెళ్ళడం లేదని,ఎన్ హెచ్ ఎక్కే వద్ద గ్రామీణ రోడ్లు సైరైన లెవల్ లేవని,అవసరమైన చోట సైన్ బోర్డ్ ఏర్పాటు తక్కువగా, సెంట్రల్ లైటింగ్ కూడా తక్కువగా ఉన్నదని వివరించారు.

Engineering Defects Should Be Rectified And Service Roads Should Be Completed SP

ఇలాంటి లోపాలు ఉన్నాయని వీటిని జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్ సంస్థ అధికారులు సమన్వయంతో పని చేసి లోపాలను త్వరగా సవరించడానికి కృషి చేయాలని కోరారు.రోడ్డు ప్రమాదాల నివారణలో అందరం సమన్వయంతో పని చేసి లోపాలను సవరించి రోడ్డు నియమ నిబంధనలపై ప్రజలకు,వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సరికొత్త ప్రణాళికతో రోడ్డుప్రమాదాలను తగ్గించాలని,మరణాలు సంభవించకుండా చూడడం ప్రాథమిక బాధ్యత,విధి అని అన్నారు.ప్రజలు,వాహనదారులు పాసేజ్ లను,అండర్ పాస్ లను సక్రమంగా వినియోగించుకోవాలని, ఎక్కడపడితే అక్కడ వాహనాలు రోడ్లు దాటించవద్దని,రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దని కోరారు.

Advertisement

జాతీయ రహదారుల భద్రత సంస్థ,జీఎంఆర్ సంస్థ అధికారులు మాట్లాడుతూ ఎన్ హెచ్ 65 పై ఇప్పటికే చాలా జంక్షన్,బ్లాక్ స్పాట్స్ వద్ద ఇంజనీరింగ్ లోపాలను సవరిస్తున్నామని,పాసెజ్ లు,సర్వీస్ రోడ్లు,ఫ్లై ఓవర్ ల నిర్మాణం కోసం చర్యలు తీసుకున్నామని అన్నారు.త్వరలో అన్ని లోపాలను సవరిస్తామని,సెంట్రల్ లైటింగ్ పెంచుతామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు,ట్రైనీ ఐపిఎస్ రాజేష్ మీనా,ఎన్ హెచ్ 65 టెక్నికల్ మేనేజర్ రాధేశ్యాం షైని,జాతీయ రహదారుల భద్రత సంస్థ జనరల మేనేజర్ శ్రీకాంత్,జీఎంఆర్ సంస్థ అధికారులు మాల్యాద్రి నాయుడు,నాగకృష్ణ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి,రజితరెడ్డి, రాము,చివ్వేంల,మునగాల, కోదాడ రూరల్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు,జిల్లా రోడ్డు సేఫ్టీ బ్యూరో ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News