బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుంది: మహమ్మద్ అబ్బాస్

సూర్యాపేట జిల్లా: రాజకీయ ప్రయోజనం కోసమే ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను సృష్టిస్తున్నాయని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమ్మద్ అబ్బాస్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన "ఉమ్మడి పౌరస్మృతి - మణిపూర్ పరిణామాలు- బీజేపీ ప్రభుత్వ విధానాలు" అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఒకే దేశం,ఒకే చట్టం,ఒకే న్యాయం,ఒకే పాలసీ,ఒకే మతం అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ,ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ, మైనార్టీలుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్స్ పై ప్రతిరోజు ఏదో ఒక చోట ఘర్షణలు,మత దాడులకు పాల్పడుతూ, ప్రశ్నించే గొంతులను హత్యలు చేస్తూ,దోపిడి, వివక్ష,ఉన్మాదంతో కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

సోదర భావంతో మెరుగుతున్న ప్రజల మధ్య ఉమ్మడి పౌరస్మృతి పేరుతో చీలికలు తెచ్చే కుతంత్రాలకు పూనుకుంటుందని విమర్శించారు.75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో నేటికీ ఆర్థిక అసమానతలు అంతరించలేదన్నారు.నేటికీ సామాజిక వివక్ష తొలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్ఎస్ఎస్,బీజేపీ దేశంలో ఏకరూపం సాధించాలని 21వ లా కమిషన్ నియమిస్తే దేశం యొక్క ఐక్యత సమగ్రతలు కాపాడాలంటే ఇప్పుడు పౌరస్మృతి అవసరం లేదని లా కమిషన్ సిఫారసు చేసిందన్నారు.భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తితో ఎన్నో మతాలు, జాతులు,సాంస్కృతులు, సాంప్రదాయాలు,భాషలు, ఆచార వ్యవహారాలు ఉన్న ఈ దేశంలో కుల,మత ఘర్షణలకు తావు లేదన్నారు.

లౌకిక శ్రేయో రాజ్యంలో ఎన్నికల సమయంలో ఈ పౌరస్మృతి చట్టాన్ని ముందుకు తెచ్చి ప్రజల మధ్య మత విద్వేషాలను పెంచి బడుగు,బలహీన వర్గాల,దళిత,గిరిజనుల దోపిడీ చేసి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే దురుద్దేశంతో బీజేపీ చేస్తుందన్నారు.ఇటీవల మణిపూర్ లో జరిగిన గిరిజన మహిళల వివస్త్రణ,గిరిజనుల ఊచకోత,హర్యానాలో మైనార్టీలపై దాడులు మనుధర్మంలో భాగమేనని అన్నారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకుందన్నారు.ఆర్ఎస్ఎస్,బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను మతోన్మాద చర్యలను ప్రజలంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

మణిపూర్ రాష్ట్రంలో వందలకొద్దీ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నందున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర బీజేపీ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు.మణిపూర్ రాష్ట్రంలో వందల కొద్ది ఘటనలు జరిగాయని,ఆ ఘటనలో అనేకమంది అత్యాచారాలకు గురయ్యారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటన్నారు.

ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతి,దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.గత మూడు నెలల నుండి మణిపూర్ లో మారణహోమం జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు.ప్రధాని ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణాలు వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగేవి కావన్నారు.

కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి తడకకు వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయాందోళన వాతావరణం ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.శతాబ్దాలుగా గిరిజన తెగలు,ఇతర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్న మణిపూర్ రాష్ట్రంలో మారణహోమం జరగడానికి బీజేపీ అనుసరించిన మతోన్మాద రాజకీయాలే కారణమని ఆరోపించారు.

దేశ రక్షణ కోసం పని చేసిన ఒక సైనికుడి భార్యని తన కళ్ళముందే బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడం భారతమాత సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విద్వేష,మతోన్మాద విధ్వంసకర విధానాలకు మణిపూర్ మారణహోమం ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
పేటలో ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు

సైన్యం, పోలీసుల కళ్ళెదుటే ఇంతటి దారుణాలు జరుగుతుంటే అరికట్టలేని ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదని బర్త్ రఫ్ చేసి శాంతిని నెలకొల్పెందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

వేల సంవత్సరాల నుండి వివిధ మతాలు తమ సాంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకుంటారని,అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదన్నారు.ప్రజల ఆచారాలను, సాంప్రదాయాలను ప్రభుత్వాలు గౌరవించాలి తప్ప అందులో జోక్యం చేసుకొని వారి మనోభావాలను దెబ్బతీయడం తగదన్నారు.

మతోన్మాద విధానాలకు పాల్పడుతున్న బీజేపీని గద్దె దించేంతవరకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు డేవిడ్ రాజు,ముస్లిం మైనార్టీ నాయకులు ముక్తి అస్సాన్ సాబ్,హఫీస్ ఇమ్రాన్, పాస్టర్ల సంఘం నియోజకవర్గ నాయకులు బోనగిరి లింగయ్య, మీసాల గోవర్ధన్,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,బుర్రి శ్రీరాములు,పారేపల్లి శేఖర్ రావు,మట్టిపెళ్లి సైదులు, కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు చాంద్,శేఖర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News