సంక్రాంతి పండుగ భోగి నుండి ప్రారంభమై కనుమతో ముగుస్తుంది.దీనిలో ఒక్కో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.
భోగి రోజు భోగి మంటలు వేసి, అందమైన రంగవల్లులతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరిస్తారు.అయితే భోగీ రోజు 5 ఏళ్ల లోపు పిల్లలపై రేగు పండ్లు పోస్తారు వీటినే భోగిపళ్లు అంటారు.అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, దీని వల్ల కలిగే లాభాలేంటో ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భోగిపళ్లు ఎలా పోస్తారు?:
సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు.గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూలరెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని.మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు.

భోగిపళ్ల వెనుక సాంప్రదాయ కారణం ఏంటి?:
సాక్షాత్తూ నారాయణుడు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాలని తింటూ తన తపస్సుని కొనసాగించాడని… దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను పిల్లపై పోస్తే…సాక్షాత్తు నారాయణుడే దీవించినట్టు అని నమ్మకం.దక్షిణభారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి రావడం కూడా ఈ సాప్రదాయం కొనసాగడానికి కారణం.

సైంటిఫిక్ కారణాలు:
రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించింది, అందుకు దీన్ని ‘ఇండియన్ డేట్స అని పిలుస్తారు.రేగు చెట్టు -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.రేగు పళ్లలో ‘సి’విటమిన్ అధికం, దీని వల్ల రోగనిరోధకశక్తిని పెరుగుతుంది.రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి.ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే.