హిందువులు ఎప్పుడో ఒకసారి ఆలయాలకు వెళ్లటం పరిపాటే.అయితే మనం గుడికి వెళ్లినపుడు గడపను మొక్కి లోపలకు వెళ్తుంటాం.
అక్కడ మన ఇళ్లలో లాగా కాకుండా రాతి గడపలను చూస్తుంటాం.అయితే ఆలయాలకు చెక్కతో నిర్మించిన గడపలు కాకుండా రాతితో ఎందుకు నిర్మిస్తారనే అనుమానం చాలా మందికి చాలా సార్లు వచ్చే ఉంటుంది.
ఆ అనుమానాన్ని మనం ఇప్పుడు తొలగించుకుందాం.ఆలయాల్లో రాతి గడపలను మాత్రమే ఎందుకు నిర్మిస్తారో, మనం గుడికి వెళ్లినప్పుడు ఆ రాతి గడపను ఎందుకు వంగి మరీ మొక్కి వెళ్లాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుడులలోని గడపలు నిర్మించేందుకు వాడే రాయి పర్వతాలకు చెందినది.అయితే పూర్వ కాలం భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతం గానూ, హిమ వంతుడు అనే భక్తుడు హిమాలయం గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గానూ అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
దేవుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే కొలువై ఉన్నాడు.కనుక ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు.అందుకే మనం గుడికి వెళ్లినప్పుడు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వచ్చే గడపను కిందకు వంగి తాకి మరీ మొక్కుతాం.ఆ తర్వాతే అడుగు లోపల పెడ్తాం.ఎందుకంటే… ప్రతి రోజూ దేవుడిని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ… అలాగే అంతటి మహా భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని కోరుతూ వేడుకోవడమే గడపకు నమస్కరించడం లోని అంతరార్థం.