వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయి వ్యక్తి గా ముద్ర పడడమే కాకుండా, జగన్ తరువాత ఆ స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి ప్రాధాన్యత గతంతో పోలిస్తే బాగా తగ్గిందని, జగన్ ఆయనను దూరం పెడుతున్నారని, పెద్దగా పట్టించుకోవడంలేదని , ఆయన ప్రభావం పార్టీ అంతటా పడకుండా కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆయనను పరిమితం చేశారని వైసీపీలోనే వినిపించేది.అయితే విజయసాయిరెడ్డి కూడా దానికి తగ్గట్టుగానే పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతం పైనే ఫోకస్ పెట్టారు.
అక్కడి రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నారు.కానీ విశాఖ జిల్లా నాయకులు మాత్రం విజయసాయి రెడ్డి పై చాలా కాలం నుంచి ఆగ్రహం గానే ఉంటూ వస్తున్నారు.
ఓ సందర్భంలో బహిరంగంగానే విజయసాయిరెడ్డి పై తిరుగుబావుటా ఎగురవేశారు.
ఇప్పటికీ చాలామంది ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు విజయసాయిరెడ్డిని పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడం తో, ఇక ఆ వ్యవహారాలకు పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఓపెన్ అయిపోయారు.
తాను జగన్ మనిషిని అని, జగన్ విశాఖ అభివృద్ధి కోసమే తను పంపించారని , జగన్ ఆదేశాల మేరకే తాము వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాము అంటూ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. జగన్ విజయసాయి రెడ్డి మధ్య దూరం బాగా పెరిగింది అంటూ ఇటీవల మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితుల్లో తాను జగన్ మనిషిని అంటూ విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా పార్టీలోని నాయకులకు హెచ్చరికలు పంపారు.
పార్టీలో తాను చెబితే జగన్ చెప్పినట్లే అనే సంకేతాలను విజయసాయిరెడ్డి ఇచ్చారు.

దీని ద్వారా పార్టీలో తనను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న నాయకులకు ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి హెచ్చరికలు పంపించినట్లు అర్థమవుతుంది.ఇటీవల విశాఖ వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డిని లెక్క చేయనట్టు గా వ్యవహరించడం , ఆయన ఆదేశాలను పాటించకపోవడం, పట్టించుకోనట్టు గా వ్యవహరించడం వంటి కారణాలతో తన పట్టు విశాఖలో తగ్గిపోతుందని, దీని ద్వారా జగన్ దగ్గర తన పలుకుబడి తగ్గిపోతుంది అనే కంగారులో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది.