ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్, జిల్ల కోర్టు జడ్జి, ఎస్పీ ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.డీఆర్డీఏ ఆద్వర్యంలో జిల్లాలోని లీడ్ బ్యాంక్, వివిధ బ్యాంకుల ద్వారా 528 మహిళ సంఘాలకు చెందిన 5626 మందికి రూ 91 కోట్ల రుణాలు, 84 సంఘాలకు చెందిన 423 మంది మహిళలకు స్త్రీ నిధి ద్వారా రూ.5.22 కోట్లు, మెప్మా ఆద్వర్యంలో 80 మహిళా సంఘాలకు రూ.10 కోట్ల రుణాలు మంజూరు కాగా, లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెక్కులు అందజేశారు.వివిధ శాఖల ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను విప్, కలెక్టర్ అందజేశారు.

కారుణ్య నియామకాల కింద కర్నె దేవేంద్ర, కంకణాల దేవ లత, అనీల్ కుమార్ కు పత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు.భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.పౌరులందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం సిద్దించాయి.

Advertisement

ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజా పాలన 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి కొనసాగుతోంది.ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము.

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.ప్రజాప్రభుత్వం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను.

వ్యవసాయ రంగం:ఏ పనైనా ఆగవచ్చు.కానీ వ్యవసాయం ఆగదు (Everything can wait but not agriculture) అని మనదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి మాటలను మన ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది.

రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పని చేస్తుంది.మహనీయులు నెల్సన్ మండేలా గారు చెప్పిన విధంగా ఒక పని చేసే వరకు అసాధ్యంగానే కనపడుతుందనే మాటలు రుణమాఫీ అంశానికి సరిగ్గా సరిపోతాయి.

వైరల్ వీడియో : సిటీ బస్సులో ప్రత్యక్షమైన దెయ్యం..
రాజన్న ఆలయంలో వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం

గత ప్రభుత్వాలు అసాధ్యమని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సుసాధ్యం చేసింది.దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.

Advertisement

రెండు లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకు ఉన్న రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీచేసి స్వాతంత్ర్య దినోత్సవం రోజున రైతులను రుణవిముక్తులను చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటున్నారు.మన జిల్లాలో మొదటి, రెండు విడుతలలో 35 వేల700 మంది రైతులకు 283 కోట్ల 48 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది.

నేడు మూడవ విడత కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు కానున్నది.సాగు చేసుకునే రైతులకు దక్కాల్సిన రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్హులకు, భూస్వామ్యులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందించడం వల్ల ప్రజాధనం వృథా కావడాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించింది.

వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తుంది.దీనిపై రైతులతో నేరుగా చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాలను విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందించే రైతుభరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిచనున్నది.

ఇచ్చిన మాట ప్రకారం రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాం.వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్దరిస్తుంది.

రైతుల తరపున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది.పంటల బోనస్ పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించింది.ప్రస్తుత వానాకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలు అవుతుందని, రైతులందరూ సన్నరకం ధాన్యం సాగుచేసి బోనస్ పొందాలని కోరుతున్నాము.

రైతునేస్తం కార్యక్రమం క్రింద రైతువేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలను నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అందిస్తున్నాము.ప్రజా పాలన కేంద్రాలు :రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ లోని మహాత్మాజ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు.అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు.

ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసి, రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాము.

అభయహస్తం గ్యారెంటీ పథకాలు: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంది.ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది.

ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం.మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మీ గ్యారెంటీ పథకం కింద మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సాకర్యం కల్పించాం.ఈ పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకు సుమారు 44 కోట్ల 93 లక్షల రూపాయల విలువ గల 1 కోటి 12 లక్షల 99 వేల 423 జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు.

ఈ పథకం పట్ల లబ్దిదారులు చాలా సంతోషంగా ఉన్నారు.మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు, రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువులు, స్నేహితుల ఇండ్లకు ప్రయాణం చేస్తున్నారు.

నిరంతరం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో మహిళలు ఆర్థిక భారంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు.ఈ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు ప్రజా ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది.

మన జిల్లాలో ఇప్పటి వరకు 95 వేల 146 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 5 కోట్ల రూపాయల సబ్సిడీ సొమ్ము జమచేశాం.రాష్ట్రంలోని పేదలకు, వెనుకబడిన వర్గాల ప్రజల గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది.

మన జిల్లాలో ఈ పథకం క్రింద మార్చి 1, 2024 నుంచి ఆగస్టు 10, 2024 వరకు 4 లక్షల 42 వేల 478 జీరో బిల్లులు జారీచేయడం జరిగింది.ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 16 కోట్ల 95 లక్షల 46 వేల 569 రూపాయలను గృహజ్యోతి క్రింద చెల్లించడం జరిగింది.

రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు:వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి వీటీడీఏ కు 2024-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.దీంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం.

అలాగే భక్తులకు సులభంగా.వేగంగా దర్శనం కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.

ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాన్ని అమల్లోకి తీసుకొచ్చాం.భక్తులకు వసతి కల్పించేందుకు దాదాపు 32 కోట్ల రూపాయల అంచనాలతో స్వామివారి గుడి చెరువు స్థలంలో 96 గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాము.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రీతి పాత్రమైన మొక్కు అయిన కోడెలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటి ఇబ్బందులు దూరం చేశాం.వాటికి నిలువ నీడ కల్పించేందుకు షెడ్లు దాదాపు రూ.66 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చాం.రూ.43 లక్షలతో సీసీ ఫ్లోరింగ్, రూ.18 లక్షలతో డ్రైనేజీ, జాతర గ్రౌండ్ వద్ద ఉన్న గోశాలలో రూ.50 లక్షలతో షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశాం.ఎక్కువ సంఖ్యలో ఉన్న కోడెలను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి, వాటిని రైతులు, స్వచ్ఛంద సంస్థలకు సుమారు 1 వేయి 500 కోడెలను అప్పగించాం.

జీవాలకు మేలైన దాణా, పచ్చగడ్డి అందించేలా చర్యలు తీసుకుంటున్నాము.వీటీడీఏ నిధులు 9 కోట్ల 99 లక్షల రూపాయలతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, 12 కోట్లతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో టూరిజం శాఖ ఆద్వర్యంలో బండ్ అండ్ పార్క్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

జిల్లాలోని ముంపు గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.అలాగే ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు, ఉపాధి కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం.

సాగునీటి రంగం అభివృద్ధి:జిల్లాలోని 9,10,11 ప్యాకేజీల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.త్వరలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని రైతుల సాగు కష్టాలు దూరం చేసేందుకు రూ.350 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నాము.ప్రతి చెరువు నింపి పంటల సాగుకు భరోసా కల్పిస్తాం.

రహదారుల అభివృద్ధికి చర్యలు:జిల్లాలో రోడ్లు, భవనాలు, పంచాయితీ రాజ్ విభాగాల పరిధిలో ఉన్న రహదారుల నిర్మాణం, అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది.అలాగే చందుర్తి నుండి మోత్కురావుపేట రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రానున్నాయి.

త్వరలోనే ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నం.నేతన్నలకు భరోసా:సిరిసిల్లలోని నేతన్నలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది.ఇందులో భాగంగా సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు అందజేశాం.

జిల్లాలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు రెండు యూనిఫాంల చొప్పున పంపిణీ చేయించాం.దాదాపు రూ.28 కోట్ల 84 లక్షల విలువైన క్లాత్ ఆర్డర్లను సిరిసిల్ల నేత పరిశ్రమకు అందజేశాం.ఇప్పటికే 19 కోట్ల 54 లక్షల రూపాయలు వారికి చెల్లించడం జరిగింది.

బతుకమ్మ చీరల ఆర్డర్ల బకాయిలు 247 కోట్ల రూపాయలు ఉండగా, 155 కోట్ల రూపాయలు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది.నేతన్న బీమా పథకము ద్వారా 4806 మంది మరమగ్గాల కార్మికులకు నేతన్న భీమా కల్పించబడినది.ఇప్పటి వరకు 38 మంది కార్మికుల కుటుంబాలకు రూ.5.00 లక్షల చొప్పున రూ.1.90 కోట్లను వారి నామిని బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగినది.ఈ పథకంలో నమోదు కానీ కార్మికులకు మరోసారి అవకాశం కల్పించడం జరిగినది.

ఇప్పటి వరకు 800 దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించేందుకు క్షేత్ర సిబ్బందికి ఇవ్వనైనది.కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ అందజేయడం జరిగింది.

పరిశ్రమ యధావిధిగా కొనసాగేలా పెద్ద మొత్తంలో ఆర్డర్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.ఇందిరా మహిళా శక్తి:ఒక సంఘం అభివృద్దికి, ఆ సంఘంలోని మహిళలు సాధించిన అభివృద్ధే కొలమానమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు.రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న 63 లక్షల మందిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి, వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు లక్షకోట్ల రుణాలు మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటుంది.

వారికి వివిధ రంగాలలో అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు చిన్న తరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలచే పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులను కుట్టించడం జరిగింది.మహిళా సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం కుట్టుకూలీని 50 నుంచి 75 రూపాయలకు పెంచింది.

అదే విధంగా మహిళా సంఘాలతో పట్టణాలలో ప్రజా సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం.మహిళా సంఘాలతో 12 రకాల వివిధ వ్యాపార, వాణిజ్య యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము.

ఇందిరా జీవిత బీమా పథకం క్రింద మహిళా సంఘాలలో ఉన్న మహిళలందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రభుత్వం కల్పించింది.ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 7 వేల 959 స్వశక్తి సంఘాలకు 533 కోట్ల 83 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1 వేయి 302 సంఘాలకు రూ.173 కోట్ల 98 లక్షల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది.స్త్రీనిధి ద్వారా 2024-25 సంవత్సరంనకు రూ.58 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.13 కోట్ల 11 లక్షల బ్యాంక్ రుణాలు మంజూరు చేయడం జరిగింది.జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన జిల్లాలో 96 వేల జాబ్ కార్డులను జారీ చేసి ఉపాధి కల్పించడం జరుగుతుంది.

యువతకు ఉపాధి అవకాశాలు:నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న 11 వేల 62 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది.

ఉపాధి కల్పనాశాఖ ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల పేర్లు నమోదు చేయడం, వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను స్పాన్సర్ చేయడం, నిరుద్యోగ యువతీ, యువకులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు రంగము వైపు దృష్టి సారించి ఉపాధి కల్పించడానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము.కార్యాలయంలో మొత్తం 8 వేల 159 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు.3 మినీ, ఒక మెగా జాబ్ మేళాలు నిర్వహించి మొత్తం సుమారు 1 వేయి 500 మంది నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది.ఐటీఐలను అడ్వాన్స్డ్ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నాం.పింఛన్ల పంపిణీ:జిల్లాలో చేయూత పెన్షన్ల క్రింద వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, బీడీ టెకేదార్లు, ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులు, పైలేరియా బాధితులు మరియు ఒంటరి మహిళలకు జీవన భ్రుతి క్రింద నెలకు రూ.2,016/- మరియు దివ్యాంగులకు నెలకు రూ.4,016/- అందిస్తుంది.జిల్లాలో 1 లక్ష 19 వేల 449 మంది పింఛను దారులకు ప్రతినెల రూ.26 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది.త్వరలో హెచ్చింపు పెన్షన్లు ఇవ్వనున్నాము.

వైద్య&ఆరోగ్యశాఖ:ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం యూనివర్సల్ పాలసీ రూపొందిస్తుంది.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల ద్వారా నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం.పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం.అదే విధంగా 163 వ్యాధులను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలో కొత్తగా చేర్చడం జరిగింది.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునికతను వినియోగించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది.ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డును జారీ చేయడంవల్ల అవసరమైన సమయంలో మెరుగ్గా వైద్య సేవలు అందించవచ్చు.

సిరిసిల్ల లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు వేములవాడలోని ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, రేడియాలజీ, ఐసీయూ, మొదలగు అన్ని రకాల వైద్య సదుపాయాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది.వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం సేవలు త్వరలో అందనున్నాయి.

రుద్రంగి, వీర్నపల్లి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకుని జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.విద్యాశాఖ:భావితరాల ఉన్నతమైన భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది.విద్యాశాఖను బలోపేతం చేసేదిశగా ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించింది.జిల్లాలోని 510 ప్రభుత్వ పాఠశాలల్లో 45 వేల 97 మంది విద్యార్థులు చదువుతున్నారు.7 మోడల్ పాఠశాలలు, 13 కస్తుర్భాగాంధీ విద్యాలయాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గాను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద 283 పాఠశాలలను ఎంపిక చేసిత్రాగు నీరు, మేజర్, మైనర్ రిపేర్స్, టాయిలెట్ల మరమ్మతులు చేయించడం జరిగింది.

ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కింద ఈ ఏడాది 4 వేల 384 మంది విద్యార్థులు చేరడం జరిగింది.అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నాం.స్వచ్ఛదనం – పచ్చదనం:భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుందని జాతిపిత మహత్మగాంధీ చెప్పారు.గ్రామాల అభివృద్దికి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ద్య నిర్వహణ, పచ్చదనం పెంపొం దించే దిశగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని మనజిల్లాలో విజయవంతంగా అమలు చేశాం.ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9వ తేది వరకు జిల్లాలోని 255 గ్రామపంచాయతీలు, వేములవాడ, సిరిసిల్ల మున్సిపాల్టీలలోని ప్రతి వార్డులో స్వచ్ఛదనం.

పచ్చదనం కింద నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది.ఇందిరమ్మ ఇండ్లు:సొంత ఇండ్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడి జీవిత ఆశయం.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసింది.ఇండ్లులేని అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణం నిమిత్తంరూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నాం.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిదశలో 3 వేల 500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు వీలైనంత త్వరగా అందజేయడం జరుగుతుంది.అదేవిధంగా పురోగతిలో ఉన్న రెండుపడుక గదుల ఇండ్లను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

ఉద్యానవన:ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు లక్షా యాభై వేల రూపాయల వరకు నికర ఆదాయం వస్తుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై ఉద్యానవన శాఖ భారీ సబ్సిడీ అందిస్తున్నది.ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 50 మంది రైతులతో 140 ఎకరాల్లో మొక్కలు నాటించి, డ్రిప్ పరికరాలను అందజేసాము.

ఆయిల్ పామ్ మరింత విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.భూ రికార్డుల ప్రక్షాళన:గతంలో భూరికార్డుల నిర్వహణలో జరిగిన పొరపాట్లను సవరించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది.ధరణి పోర్టల్లో పెండింగ్ ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.

మన జిల్లాలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 36 వేల 937 దరఖాస్తులను పరిష్కరించాం.మిగిలిన భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతన ఆర్వోఆర్(ROR)చట్టం రూపొందిస్తుంది.దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజలు, నిపుణుల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీలోగా తెలిపేలా నూతన వ్యవస్థను ఏర్పాటుచేశాం.బ్యాంకు రుణాలు:జిల్లాలోని 71 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖల ద్వారా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నాం.2024-25 ఆర్ధిక సంవత్సరం జూన్ చివరి నాటికి 3 వేల 934 కోట్ల లక్ష్యానికి గాను 894 కోట్ల రుణాలను ఖాతాదారులకు అందజేయడం జరిగింది.ఇందులో రైతులకు 667 కోట్లు పంట రుణాలు, వివిధ పథకాల ద్వారా బలహీన వర్గాలకు సుమారు 15 కోట్ల రుణాలను పంపిణీ చేయడం జరిగింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ:జిల్లాలో ఇప్పటివరకు అర్హత గల 1 లక్షా 73 వేల 745 బీపీఎల్ కుటుంబాలకు అవినీతికి తావులేకుండా ఈ-పాస్ యంత్రాల ద్వారా 345 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నాం.జిల్లాలో 641 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు 69 ఉండగా, మొత్తం 46 వేల 655 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ప్రతి నెలా వీరికి 212 మెట్రిక్ టన్నుల బీపీటీ సన్నబియ్యం సరఫరా చేస్తున్నాము.ఈ యాసంగి పంటలో 259 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 49 వేల 930 మంది రైతుల వద్ద నుంచి 26 కోట్ల 24 లక్షల 46 వేల 880 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.578 కోట్ల 16 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ:మహిళా, శిశు,దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది.అంగన్వాడీ కేంద్రాలను చిన్నపిల్లల పూర్వప్రాథమిక విద్యాకేంద్రాలు (ప్రీస్కూల్స్)గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాలలో 560 మంది అంగన్వాడీ టీచర్లకు అవసరమైన శిక్షణఅందించి, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల 15 వేల 374 మంది పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది.అంగన్వాడీ కేంద్రాలలో పూర్వప్రాథమికవిద్య ప్రారంభించాం.

సఖీ సెంటర్ ద్వారా మొత్తం 1 వేయి 126 కేసులు నమోదు కాగా, 799 కేసులు పరిష్కరించారు.జూలై 31వ తేదీ వరకు 557 సమావేశాల్లో సుమారు 75 వేల 118 మందికి అవగాహన కల్పించడం జరిగింది.

ఎస్సీ& ఎస్టీల అభివృద్ది:ప్రజాస్వామ్యమంటే సమాజంలోని బలహీనులకు బలవంతులతో సమాన అవకాశాలు కల్పించడం అనే మహాత్మగాంధీ తత్వాన్ని ప్రజాప్రభుత్వం 100 శాతం విశ్వసిస్తూ ఆ దిశగా ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది.ఎస్టీ తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పనకు చర్యలు చేపట్టాం.

నూతనంగా ఏర్పడిన ఎస్టీ గ్రామపంచాయతీలలో నూతన పంచాయతీ భవనాలు, ఇతర అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం.ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకు చెందిన మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరిలో 824వ ర్యాంక్ సాధించారు.పాట్నా ఐఐటీలో సీట్ పొందగా, గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందించడం జరిగింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం: జనాభాలో అత్యధికంగా ఉండే వెనుకబడిన తరగుతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పలు కార్యక్రమాలను రూపొందించింది.కల్లు గీత కార్మికులు చెట్టునుంచి పడి ప్రమాదాల బారినపడకుండా ఐఐటీ హైదరాబాద్ అభివృద్ది చేసిన కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్ కార్మికులందరికీ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది.

ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరుకాపు, పద్మశాలీ, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, తదితరకులాల అభివృద్దికి ప్రభుత్వం నూతన కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది.అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ఈబీసీ వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసింది.

కులగణన ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్దికి మరింత దోహదపడవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు : జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 20 ఎస్సీ, 8 ఎస్టీ, 15 బీసీ, 2 మైనార్టీ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మొత్తం 10 వేల 445 మంది పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు.

Latest Rajanna Sircilla News