రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ పై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.జిల్లాలో మార్చి 5,2025 నుంచి మార్చి 25, 2025 వరకు ఇంటర్, మార్చి ,21 నుండి 04 ఏప్రిల్ 2025 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఉ.9.00 నుండి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని,
ఇంటర్ మొదటి సం.5065, రొండవ సం.4245 మొత్తం 9310 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు గాను 16 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, ఈ సంవత్సరం మొదటి సారిగా ప్రతి సెంటర్ లో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, సెంటర్ అడ్రస్ రూట్ మ్యాప్ వివరాలు తెలిపే విధంగా హాల్ టికెట్ పై క్యూ ఆర్ కోడ్ ముద్రించడం జరుగుతున్నదని అధికారులు తెలిపారు.పదోతరగతి లో 3051 బాలురులు, 3717 బాలికలు మొత్తం 6768 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నట్లు వీటి నిర్వహణకు 36 పరీక్షా కేంద్రాలను, ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపర్డెంట్ ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ స్టేట్ లెవెల్ అబ్జర్వర్ ఫ్లయింగ్ వర్డ్ సిట్టింగ్ స్క్వేర్ లను నియమించడం జరిగిందని ఉ.9.30 నుండి మ.12.30 వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం.స్థాయిలో వైద్య సిబ్బంది, ఓ.అర్.ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ జేయుటకు పోలిస్ స్టేషనలొ తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిసు ద్వారా బందొబస్తు కల్పించాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో మాస్ కాపీయింగ్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షలకు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు.జిల్లాలో పరీక్షలు నిర్వహించే పరీక్షలకు ప్రశ్న పత్రాలను పోలిసు వారి బందోబస్తు వుంచి తీసుకొని వెళ్లాలని, జిల్లాలోని రెవెన్యూ శాఖ పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలని ,144 సెక్షన్ అమలు చేయాలని,
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు,ఫ్యాన్లు, లైట్లు సరిఅయిన విధంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని , వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని అన్నారు.
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ సూచించారు.ఈ సమావేశం లో ఆర్.డి.ఓలు రాజేశ్వర్, రాధాబాయి,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, డి.ఎం.హెచ్.ఓ డా.రజిత, పోలీసు, విద్యా శాఖ, ఫైర్, ఆర్.టిసి, పోస్టల్, సెస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.