రాజకీయ వ్యూహాలు రచించడంలో ఏపీ బీజేపీ నేతలు బాగా ఆరితేరిపోయారు.అధికారం దక్కించుకోవాలనే తపన ఆ పార్టీ నాయకుల్లో బలంగా కనిపిస్తోంది.2024 ఎన్నికల్లో విజయం తన ఖాతాలో పడుతుంది అని బిజెపి అంచనా వేస్తోంది. జనసేన పార్టీ సహకారం కూడా ఉండటంతో క్షేత్రస్థాయిలో బీజేపీకి పట్టు దొరుకుతుంది అనే అంచనాలో ఉంది.
మొన్నటి వరకు పవన్ పెద్దగా పట్టించుకోనట్లు కనిపించినా, బిజెపి పెద్దలు ఇప్పుడు మాత్రం ఆయనకు ప్రాధాన్యం పెంచాలనే విధంగా వ్యవహరిస్తున్నారు.దీనంతటికి కారణం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉండడమే.
ఇక్కడ వైసీపీ ఎంపీ గా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ కే అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తుండగా, ఇక్కడ పట్టు నిలుపుకోవాలని టిడిపి ప్రయత్నిస్తోంది.
ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతి లో బీజేపీ జెండా రెపరెపలాడించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఎన్నికలను రెఫరెండం గా చూపించాలని తహతహలాడుతోంది.తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బిజెపి అక్కడ గెలవలేదు.
పోటీ చేసిన ప్రతీసారి ఓటమే బిజెపిని పలకరిస్తూ వస్తుండడంతో, ఇక పవన్ చరిష్మా తో ఇక్కడ గెలుపు బాటలు వేసుకోవాలని చూస్తున్నారు.ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, వారంతా పవన్ ను ఆరాధిస్తూ ఉండడం, గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందడం, ఇలా అనేక సమీకరణాలను బిజెపి లెక్కలు వేసుకుంటోంది.
ఈ మేరకు త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయించి, బిజెపి జనసేన కార్యకర్తలకు ఉత్సాహం తీసుకురావడంతో పాటు, జనాల్లోకి దూసుకెళ్లేలా బిజెపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఇక పవన్ సైతం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, బీజేపీకి గెలుపు అందిస్తే, తన ప్రాధాన్యం కేంద్ర బిజెపి పెద్దల దగ్గర మరింతగా పెరుగుతుందనే లెక్కల్లో జనసేనాని ఉన్నారట.