సాధారణంగా మనం దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారికి తోచిన నూనెలను వేసి దీపారాధన చేస్తుంటారు.కొందరు ఆముదం వేయగా, మరికొందరు నువ్వుల నూనెను ఉపయోగిస్తారు.
మరికొందరు నెయ్యితో కూడా ఉపయోగిస్తారు.ఈ విధంగా ఎవరికి తోచినట్టు వారు దేవ దేవతలను దీపారాధన చేసి పూజించడం మనం చూస్తుంటాము.
అయితే దీపారాధన చేసేటప్పుడు చమురు, నెయ్యి, నువ్వుల నూనె కన్నా కొబ్బరినూనెతో దీపారాధన చేయటం వల్ల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా కొబ్బరినూనెతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
నిత్యం ఇంట్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల కుటుంబంలో అనుకున్న శుభకార్యాలు తొందరగా జరుగుతాయి.అదేవిధంగా 40 రోజుల పాటు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల మనకు రావలసిన మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి.
ముఖ్యంగా కుజ దోషం ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ఈవిధంగా కుజదోషం ఉన్నవారు మంగళవారం లేదా శుక్రవారం కొబ్బరినూనెతో దీపారాధన చేసి వారికి పప్పుతో చేసిన బొబ్బట్లు నైవేద్యంగా సమర్పించి 11 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వటం ద్వారా కుజ దోషం తొలగిపోతుంది.
పితృదేవతలకు పిండ ప్రదానం చేసే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి మాలలను సమర్పించి, కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో గడుపుతారు.
అదేవిధంగా కాశిలోని విశ్వేశ్వరుడికి సాయంత్రం హారతి సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల కోరుకున్న కోరికలు నిర్విఘ్నంగా పూర్తవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.అదేవిధంగా హరిద్వార్ లోని సాయంత్రం సంధ్యా దీపం కొబ్బరి నూనెతో వెలిగించి గంగానదిలో వదలటం ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రతియేటా గంగా స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.