వక్ఫ్ భూముల పరిరక్షణకై కలెక్టర్ ఆఫీసు ముందు మహాధర్నా

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల వ్యాప్తంగా వక్ఫ్ భూములను,దేవాదాయ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ ల ద్వారా పూర్తిగా మాయం చేశారని, నూతనకల్ ఎమ్మార్వోపై సీబీసిఐడి విచారణకు ఆదేశించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ డిమాండ్ చేశారు.

నూతన కల్ మండలంలో అన్యాక్రాంతం అయిన వక్ఫ్ భూములను పరిరక్షించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు మహా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో సర్వే నెంబర్ 405లో 9 ఎకరాల 6 కుంటలు మరియు 463 సర్వే నెంబర్లు 38 కుంటలు కలిపి మొత్తం 10 ఎకరాల 4 కుంటల వక్ఫ్ భూమి విస్తీర్ణం కలదని అన్నారు.ఈ భూములు అక్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయని గత తొమ్మిది నెలల నుండి స్థానిక ఎమ్మార్వో,ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ డే లో వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు.

వక్ఫ్ భూమిని ప్రొవిటేడ్ ల్యాండ్ లో వేయించి సర్వే చేయగలరని నూతనకల్ ఎమ్మార్వో ని జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు.దీనిపై గత మూడు నెలల నుండి స్థానిక తహశీల్దార్ సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ,ఆగస్టు ఒకటవ 2022 ఉదయం 10 గంటలకు సర్వే తేదీ ప్రకటించి మళ్ళీ క్యాన్సల్ చేశారని,తిరిగి 1/09/2022 న సర్వేకి సమయం ఇచ్చి,పక్క రైతులకు సమాచారం ఇవ్వకుండా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూస్వాములకు సమాచారం ఇచ్చి 29/08/2022న కోర్టుకు వెళ్లేలా ప్రోత్సహించారని ఆరోపించారు.

తిరిగి 1/09/2022 న సర్వే గురించి ఫోన్ చేయగా సర్వే క్యాన్సిల్ చేసినామని చెప్పారని,వక్ఫ్ భూముల విషయంలో స్థానిక తహశీల్దార్ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోందని,ఆయనపై తక్షణమే సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.శిల్పకుంట్ల గ్రామమే కాకుండా నూతనకల్ మండల వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూములపై దర్యాప్తు చేయాలని అవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మందితో కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో అవాజ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షాకీర్,గౌరవ అధ్యక్షులు షేక్ సైదులు,జిల్లా ఉపాధ్యక్షులు నజీర్ ఖాన్,కమిటీ సభ్యులు మహమ్మద్,అబ్దుల్,అజీజ్,ఎస్.డి సమీ,ఎండి ఇనాం,ఎస్.

డి కుర్షి,ఎస్కే.రఫీ జానీ బేగం,రేష్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News