సంఖ్యాపరంగా పెద్దగా బలం లేకపోయినా తమకు ఏకు మేకులా తయారయిన జనసేన పార్టీ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్నా, వైసీపీ మీద అసెంబ్లీ లోనూ, బయటా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నా జనాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చేస్తున్న విమర్శలు, పోరాటాలు, ధర్నాలు ఇవన్నీ ప్రభుత్వానికి చాలానే డ్యామేజ్ చేస్తున్నాయనే అభిప్రాయం వైసీపీలో నెలకొంది.అందుకే ఆ పార్టీ విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
దీనిలో భాగంగానే జనసేన పార్టీని అన్నిరకాలుగా దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు అర్ధం అవుతోంది.పవన్ కల్యాణ్కు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న వారందరిని ముందుగా టార్గెట్ చేసి ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు బయటకి వస్తున్నాయి.

ఈ విషయంలో పవన్ కు అత్యంత సన్నిహితుడైన రాజు రవితేజ ను బయటకి తెచ్చి వైసీపీ మొదటి ఫార్ములాను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసినట్టు కనిపిస్తోంది.రాజకీయాల పరంగా చూసుకుంటే రాజురవితేజ అనే వ్యక్తి ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు.ఆయన పవన్ కల్యాణ్ కు అత్యంత ఆప్త మిత్రుడు.రాజురవితేజ భావజాలం, ఆయన ఆలోచన విధానం ఒక్కటి కావడంతో జనసేన పార్టీని స్థాపించే సమయంలో పవన్ ఆయన గురించే ఎక్కువ చెప్పారు.
దీంతో రాజు రవి తేజ విషయం బయటకి వచ్చింది.పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి ఒక్కసారిగా బయటకి రావడమే కాకుండా పవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం అందరిని షాక్ కి గురిచేసింది.
ఇక మీడియా కూడా రాజు రవితేజను స్టూడియోలో కూర్చోబెట్టి రకరకాల ప్రశ్నలతో కొత్త కొత్త విషయాలను బయటకు లాగే పనిలో పడ్డాయి.

ఇక్కడే వైసీపీ వ్యవహారం బయటకి పొక్కింది.ఆయన సొంతంగా పవన్ కల్యాణ్కు దూరం జరగడం లేదని, తాను అలా బయటకి వెళ్ళడానికి, పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడడానికి కారణాలు ఏంటో ఆయనే క్లూ ఇచ్చేసాడు.తాను కొద్ది రోజుల క్రితం వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కలిశానని మీడియా ముందు చెప్పారు.
అంతే కాదు విజయసాయి రాజకీయ విధానాలు తనకు నచ్చాయి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు.పోనీ ఆయన వైసీపీలో చేరతాడా అంటే రాజురవితేజ తెలంగాణ వ్యక్తి.ఆయన కరీంనగర్కు చెందిన వాడు.మరి అటువంటప్పుడు విజయసాయిరెడ్డిని కలవాల్సిన అవసరం ఏముంది అనేది ఎవరికీ అంతుపట్టడంలేదు.
తెలంగాణలో వైసీపీ లేదు.అయినా రాజు రవితేజ మాటలను బట్టి చూస్తే కావాలనే వైసీపీని దెబ్బకొట్టేందుకు రాజు రవితేజను ప్రలోభ పెట్టడమో మరేదయినా మేలు చేస్తామని చెప్పడంలో చేసి ఉండాలనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.