తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ దూకుడుతో పోలిస్తే కాస్త వెనకబడి ఉన్నదని చెప్పవచ్చు.అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అయితే ఇటీవల జగ్గారెడ్డి బహిరంగంగా తనను కోవర్ట్ అని చేస్తున్న ప్రచారం పట్ల ఘాటుగా స్పందించినా కోమటిరెడ్డిపై ఇదే తరహాలో ప్రచారం జరిగినా ఇప్పటివరకు అంతగా స్పందించలేదు.అయితే గత నెల రోజుల క్రితం జరిగిన రైతు దీక్ష సమయంలో కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి ఒక్కటయ్యారనే సంకేతాలు ఇచ్చినా ఇంకా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉందని కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల ద్వారా అర్థమయింది.
రేవంత్ రెడ్డి మీరు కలిసి ఎన్నికల ప్రచారాలు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు అది జరగడం అసంభవమని, రేవంత్ రెడ్డి స్టైల్ వేరు, నా స్టైల్ వేరని నాకు పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ప్రయత్నిస్తానని, తాను కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపుకు ప్రయత్నిస్తారే తప్ప కలిసి పనిచేయడం అన్నది జరిగే పని కాదని కుండబద్దలు కొట్టారు.అంతేకాక తనను కోవర్ట్ గా స్వంత కాంగ్రెస్ పార్టీ వారే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమని త్వరలో ఈ విషయాన్ని సోనియాగాంధీకి తెలియజేస్తానని, గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, రెండు, మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సీనియర్ లను అవమాన పరిచే విధంగా వ్యవహరించడం సమంజసం కాదని అటువంటి వారికి కాలమే సమాధానం చెబుతుందని కోమటి రెడ్డి అభిప్రాయ పడ్డారు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇక కాంగ్రెస్ లో ఐక్యత వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.