ఏ మహాశక్తి లేదా దయ వల్ల మనం అన్నం తింటున్నామో ఆ మహా శక్తికి నివేదించి లేదా అర్పించి కృతజ్ఞతను చూపించడం కోసమే ఈ దేవ యజ్ఞం ఉద్దేశింపబడింది.పంచ మహా యజ్ఞాలతో కూడినదే వైశ్వ దేవం అని పెద్దల అభిప్రాయం.
ఇది గృహ్యాగ్నిలో కానీ, మామూలు అగ్నిలో కానీ చేయాలని, అగ్ని లేకపోతే నీళ్ళలో గానీ, వట్టి నేలపై గానీ జరుపుకోవాలని శాసనం.ఇందులో సమస్త దేవతలకు బలి (పూజ) ఉంటుంది.
తాను తినక పోయినా చేయాలని అపరార్కుడు చెప్పాడు. వైశ్వదేవం చేయకపోతే రోజంతా ఉపవాసం ఉండాలని అన్నారు.
దీని వల్ల ఆహార శుద్ధి ఏర్పడుతుందని పెద్దల మాట.ఇది ప్రొద్దున్న, సాయం కాలం కూడా ఉంటుంది.గౌతముని మత ప్రకారం వైశ్వదేవంలో అగ్ని ధన్వంతరి విశ్వేదేవుల ప్రజాపతి స్విష్టకృత్ దేవతలకు పూజ ఉండగా మనువు ప్రకారం అగ్ని సోముడు అగ్నిష్టోములు విశ్వే దేవతలు ధన్వంతరి కుహు అనుమతి ప్రజాపతి ద్యావాపృథ్వులు స్విష్టకృత్ మొదలగు దేవతలకు పూజ.
సాయం కాలం భార్యయే మంత్రాలు లేకుండా చేయవచ్చని ఉంది.ఇది మొదటి మూడు వర్ణాల వారి మాట.మిగిలిన వారికి ఆ దేవతలను ఉచ్చరిస్తూ చివర నమః అని చేర్చి పచ్చి ద్రవ్యాలతో చేయాలని ఉంది.ఇందులో మినుము, సెనగ, కొర్రలు, బటానీ, ఉప్పు, నూనెతో చేసినవి, పాడైపోయిన పదార్థాలను విసర్జించాలి.ఆహారం అర్పించ లేని వాడు పండ్లతో గాని, వేరు లతో గాని, నీళ్ళతో గాని చేయవచ్చు.
వైశ్వ దేవం చేయలేక పోతే కనీసం ఆ మంత్రాలను చదివినా ఫలం ఉందన్నారు.