శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరిగి ముగిసిపోయాయి.దేవస్థానం అధికారులు, సిబ్బంది ఈ 11 రోజులు భక్తులను వదిలేసి పెద్దల సేవలో ఉన్నారు.
వారికి కావాల్సిన వారికి దర్శనం కల్పిస్తూ కాలం గడిపారు.పట్టించుకునే నాధుడే లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వెంకటాపురం నుంచి శ్రీశైలానికి కాలినడకన వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ముఖ్యంగా నీటి వసతి లేక దాహార్తిని తీర్చుకోవడానికి అవస్థలు పడ్డారు.
ఇదే అదునుగా తీసుకొని కొందరు ఏకంగా బాటిల్ లూజ్ వాటర్ లీటర్ 30 నుంచి 40 వరకు విక్రయించారు.అంటే పాదయాత్రికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇలా బ్రహ్మోత్సవాలలో ప్రతి చోటా ఇబ్బందులు పడ్డామని భక్తులు దేవస్థానం అధికారులు, సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు ఆది దంపతుల వివిధ వాహన సేవలను చూడడానికి దేశ నలమూలాల నుంచి దాదాపు పది లక్షల మంది వరకు భక్తులు హాజరైనట్లు దేవాలయాధికారులు చెబుతున్నారు.ఇక్కడి వరకు బాగానే ఉన్న బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సౌకర్యాలు అందించడంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, పాలకమండలి పూర్తిగా విఫలమైంది.దేవుడి మీద భక్తితో వచ్చారు.మీ బాధలు మీరు పడండి అన్న తీరున బ్రహ్మోత్సవాలు సాగాయని భక్తులు విమర్శిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలు మొదలైన ఐదు ఆరు రోజులకు గానీ శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండదు.కానీ నడకన వచ్చేవారు కూడా అప్పుడే మొదలవుతారు.వీరంతా వెంకటాపురం నుంచి కాలి నడకన బయలుదేరుతారు.
ఈ మార్గమంతా దట్టమైన అడవి ప్రాంతం.తాగు నీటికి కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులదే.అయినా కూడా దేవస్థానం అధికారులు అసలు పట్టించుకోలేదు.
ఇక వైద్య శిబిరాలు కూడా ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడూ ఉండవో ఎవరికీ తెలియదు.చాలా దూరం నుంచి నడిచి సొమ్మసిల్లి పడిపోయిన వారికి, అనారోగ్యం ఉన్న వారి పరిస్థితి ఇక అంతే.
LATEST NEWS - TELUGU