పరమ శివుడు పులి చర్మాన్ని ధరించి, పులిచర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్నుడై కూర్చుని ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులిచర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం మనకు కలగక మానదు.దీనికి గల కారణం శివపురాణం లో ఒక కథలో చెప్పబడింది.
పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి.స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగుతూ ఉండేవాడు.ఒకనాడు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు, (మునుల భార్యలు) పరమేశ్వరుని సౌందర్యానికీ, ఆయన తేజస్సుకీ కళ్ళు తిప్పుకోలేకపోయారు.
వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష రోజు రోజుకి పెరగసాగింది.ఆయననే తలుచుకుంటూ గృహకృత్యాలను కూడా సరిగా చేసేవారు కాదు.
తమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది.
వారు ఆ దిగంబరుడే సదాశివుడని మరచిపోయి ఆయనను సంహరించడానికి ఆలోచన చేశారు.
ప్రతిరోజూ స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు.స్వామి ఆ గుంత దగ్గరకు రాగానే అందులోనుంచీ వారి తపశ్శక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదికి ఉసిగొల్పారు.
రుద్రుని ఎదుట నిలవగలిగిన పరాక్రమం ఈ ప్రపంచం లో ఎవరికైనా ఉంటుందా? మహాదేవుడు అనాయాసంగా ఆ పులిని సంహరించాడు.మునుల చర్యవెనుక ఉన్న వారి ఉద్దేశ్యం అర్థం చేసుకుని ఆ పులితోలుని కప్పుకున్నాడు.
స్వామి పులిచర్మం పై కూర్చున్నా, పులిచర్మాన్ని ధరించినా అందుకు కారణం ఆయన సర్వోత్కృష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే.