బెల్ట్ షాపులు బంద్ చేస్తే అభివృద్ధికి లక్ష రూపాయల ఇస్తా...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం( Neredcherla mandal ) పెంచికల్ దిన్నె గ్రామంలో నడుస్తున్న బెల్టు షాపులు పూర్తిగా బంద్ చేస్తే గ్రామాభివృద్ధికి రూ.లక్ష నజరానా ఇస్తానని క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు,పెంచికల్ దిన్నె మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్( Sunkara Kranti Kumar ) ప్రకటించడంతో గ్రామంలో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ బెల్ట్ షాపులను మూయించేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ గ్రామంలో మందు విక్రయ కేంద్రాలుగా బెల్ట్ షాపులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో గ్రామ యువత,ప్రజలు అప్పుల భారంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు,నేరాలకు పాల్పడే అవకాశం ఉందని,గ్రామంలో విచ్చలవిడిగా అమ్మకాల వల్ల జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) ఆయన నియోజకవర్గంలో బెల్టు షాపులు ఎత్తివేసిన గ్రామానికి రూ.5 లక్షల నజరానా ప్రకటించడానికి స్వాగతిస్తూ,ఆయనను ఆదర్శంగా తీసుకొని పెంచికలదిన్నె గ్రామంలో కూడా అలాంటి వాతావరణం ఏర్పడితే బాగుంటుందన్న ఉద్దేశంతో గ్రామ ప్రజల శేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రాంతి కుమార్ చెబుతున్నారు.గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు,బెల్ట్ దుకాణదారులు సహకరించి గ్రామం అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరుతున్నారు.

గ్రామ ప్రజలు,ప్రజా ప్రతినిధులు, యువకులు,ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

Latest Suryapet News