హిందూ సంప్రదాయం ప్రకారం దేవునికి పూజ చేయడం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు.పూజకి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టత ఉంది.
అయితే పూజ చేసే సమయంలో పుష్పాలు ఉపయోగించడం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది.భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే పుష్పాలను గాని, పండ్లను గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించారు.
అయితే పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగించాలి.వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండదు.
దేవునికి సమర్పించే పుష్పాలు ఎందుకు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో ఉండేలా చూసుకోవాలి.పురిటి వారు, మైలవారు, బహిష్టులైన మహిళలు పుష్పాలను తాకకూడదు.అలాంటివి పూజకు పనికి రావు.
భూమి పై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించకూడదని వేద పండితులు చెబుతున్నారు.శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి.
వాడిపోయినవి, ముళ్ళతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి దుర్గంధ పూరితమైన పుష్పాలను అస్సలు ఉపయోగించకూడదు.
మహా శివునికి మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడని వేద పండితులు చెబుతున్నారు.అయితే విష్ణు భగవానుడికి తులసి దళాలతో, శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వుతో పూజించడం మంచిది.సూర్యుడిని, వినాయకుడిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజించడం మంచిది.
శ్రీ మహా లక్ష్మికి ఎర్ర పుష్పాలు అంటే ఎంతో ఇష్టం.ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి, ఆమె అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడూ ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.