ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యంతో పంట నీటి పాలు...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఎన్ఎస్పి కెనాల్ గేటు తెగి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి విడుదలైన నీళ్లు పొలాల్లోకి మళ్ళడంతో వందల ఎకరాల్లో వరి పంట నీటి పాలైంది.

ఖరీఫ్ సీజన్లో సరైన సమయానికి నీటి విడుదల చేయక,వర్షాలు సకాలంలో పడక ఎడమ కాలువ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో క్రాప్ హాలీ డే ప్రకటించిన సంగతి తెలిసిందే.

బోర్లు,బావులను నమ్ముకొని కొద్దిమంది సాగు చేస్తే 24 గంటల కరెంట్ సక్రమంగా ఇవ్వక, చాలా వరకు పొట్ట దశలో పొలాలు ఎండిపోయి అన్నదాతలు ఆగమయ్యారు.కష్టపడి కాపాడుకున్న పంట కూడా కోతకొచ్చిన సమయంలో ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీళ్లపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే జరగాల్సిన నష్టం జరిగాక సోమవారం ఎడమ కాలువకు అధికారులు నీటి విడుదల నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Latest Suryapet News