యాదాద్రి జిల్లా: అక్రమ బ్లాస్టింగులతో దత్తాయపల్లి చల్లూరు,మల్లాపూర్ గ్రామాల ప్రజలు,రైతులు బెంబేలెత్తిపోతున్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని తుర్కపల్లి,రాజాపేట,యాదగిరిగుట్ట మండలాల పరిధిలోని దత్తాయపల్లి,చల్లూరు,మల్లాపూర్ గ్రామాల శివారు భూముల్లో ఇటీవల అక్రమంగా వెలసిన యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని,సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి యాదాద్రి హిల్స్ వెంచర్ అక్రమ బ్లాస్టింగులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ,దౌర్జన్యంగా వెంచర్ ఏర్పాటు చేస్తూ అక్రమ బ్లాస్టింగులకు పాల్పడుతున్నారని,ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో వెంచర్ కాంపౌండ్ వాల్ గోడలు కూలి పచ్చటి పంట పొలాలు దెబ్బతిన్న సంఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు.ప్రజాప్రతినిధులకు,అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాత్రిపగలు చేస్తున్న బ్లాస్టింగులతో జనం బెంబేలెత్తుతున్నారని,ఇళ్లల్లో ఉండలేక,వ్యవసాయ పొలాల్లో బ్రతుక లేక జీవనం గడుపుతున్నారని అన్నారు.పెద్ద పెద్ద శబ్దాలతో బ్లాస్టింగ్స్ జరుపుతున్నారని,బండరాళ్లు వ్యవసాయ పొలాల్లో పడుతూ పచ్చటి పంట చేలను సర్వనాశనం చేస్తున్నాయని,బోరు బావులు పూడుకుపోయి నీళ్లు రాని పరిస్థితితులు నెలకొన్నాయని,ఇండ్లన్నీ పగుళ్లు పడుతున్నాయని చెప్పారు.
అదేవిధంగా దత్తాయపల్లి గ్రామపంచాయతీ పేర రిజిస్ట్రేషన్ చేసిన పది శాతం భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా అడ్డుగోడ నిర్మించి, అతిపెద్ద గేటును బిగించి,పంచాయతీ భూమిని సైతం ఆక్రమించి చుట్టూరా ఫీనిషింగ్ ఏర్పాటు చేయడంతో రైతులు,ప్రజలు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లనీయకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసి వాళ్లకు పెద్ద,పెద్ద గన్నులిచ్చి ఇచ్చి మరీ కాపాల పెట్టడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.కావునా ఇప్పటికైనా ఇట్టి అక్రమ వెంచర్ పైన ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు,అధికారులు చర్యలకు ఉపక్రమించని పక్షంలో ఆయాగ్రామాల ప్రజలు, రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.