ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి : జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై సెక్టార్ అధికారులు, పోలీస్ అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ అఖీల్ మహాజన్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ప్రతి ఎన్నికను ఒక కొత్త ఎన్నికగా మాత్రమే మనం పరిగణించాలని, ఎన్నికల కమీషన్ మనకు కేటాయించిన విధులను ఎటువంటి అలసత్వం వహించకుండా సంపూర్ణంగా పూర్తి చేయాలని, ఎన్నికల సందర్భంగా ఏ చిన్న పొరపాటు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ తెలిపారు.మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 547 పోలింగ్ కేంద్రాలకు 57 సెక్టర్ల పరిధిలో వస్తాయని, సదురు పోలింగ్ కేంద్రాలలో సజావుగా పోలింగ్ జరిగేలా ఈ సెక్టార్ అధికారులు బాధ్యత వహించాలని, సెక్టార్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల రూట్ లను ముందస్తుగా పోలీసు అధికారులతో కలిసి పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.

పారదర్శకంగా ఎన్నికల నిర్వహించడంలో సెక్టర్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, అర్హులైన వారికి ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేయడం నుంచి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతుల కల్పన, సకాలంలో పోలింగ్ రిపోర్ట్ లో అందజేయడం, రిజర్వ్ ఈవీఎం యంత్రాల నిర్వహణ, పోలింగ్ సమయంలో ఈవీఎం యంత్రాలు మొరాయిస్తే వెంటనే నూతన ఈవిఎం యంత్రం ఏర్పాటు చేయడం వంటి అనేక బాధ్యతలను సెక్టార్ అధికారులు నిర్వహించాల్సి ఉంటుందని , ఈ బాధ్యతల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్క సెక్టార్ అధికారి తెలుసుకొని వాటి ప్రకారం పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, ప్రీ పోల్, పోల్ డే, పోస్ట్ పోల్ డే లలో వారు పాటించాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సమయంలో నిబంధనలపై ఏమాత్రం పట్టు కోల్పోయిన ఇబ్బందులు ఎదురవుతాయని, ఒకటికి రెండుసార్లు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.

రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, సెక్టర్ అధికారులు ముందస్తుగా వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ర్యాంపు, త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం వెలుతురు మొదలగు ఏర్పాట్లు పరిశీలించాలని, అదేవిధంగా పోలింగ్ నాడు అవసరమైన మేర త్రాగునీరు, ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఎన్నికల పోలింగ్ సమయంలో మాక్ పోల్ నిర్వహణ, సకాలంలో పోలింగ్ ప్రారంభించడం, ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాల నివేదిక సమర్పించడం, పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడం, మొదలైన పనులు సెక్టార్ అధికారులు పర్యవేక్షించా లని, పోలింగ్ తర్వాత పోలింగ్ జరిగిన తీరుపై నివేదిక సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

Advertisement

ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని అన్నారు.భారత ఎన్నికల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం యంత్రాల ప్రోటోకాల్ పాటించాలని, ఈవీఎం యంత్రాలను ప్రభుత్వ వాహనాలలో మాత్రమే తరలించాలని, రిజర్వ్ ఈవీఎం యంత్రాలపై తప్పనిసరిగా స్టిక్కర్లు ఉండాలని, గత ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలను పరిశీలించి మన దగ్గర ఎటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం సమావేశంలో పాల్గొన్న ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ, ఎన్నికల విధులు నిర్వహించే సమయంలో నియమ నిబంధనల పై అధికారులకు పట్టు ఉండాలని అన్నారు.ఎన్నికల సందర్భంగా నిర్వహించే తనిఖీలలో ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించవద్దని అన్నారు.

గత ఎన్నికల సందర్భంగా అధికంగా ఇబ్బందులు వచ్చిన ప్రాంతాలను, పోలింగ్ కేంద్రాల పరిధి గుర్తించి నివేదిక సమర్పించాలని, సదరు పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ కేంద్రాల కింద పరిగణించి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు పి.గౌతమి, ఖీమ్యానాయక్ , సిరిసిల్ల , వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారులు రమేష్, రాజేశ్వర్, సెక్టర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News