గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి విద్యార్థి మరణించడం పై అధికారులపై చర్యలు తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: గురుకుల పాఠశాలలో అర్థరాత్రి విద్యార్థి మరణించడం పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.

ఈ సందర్బంగా తెలంగాణా భవన్ లో కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

రవి గౌడ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గాలికి వదిలేయడం జరిగిందన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఈరోజు వరకు విద్యార్థుల మరణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

ముమ్మాటికీ ఇవి ప్రభుత్వ హత్యలే అని వీటిపైనా ప్రత్యేక కమిటీ వేసి వీటికి కారణమైన వారిని తగిన శిక్ష వేయాలని, మళ్లీ ఇలాంటి అనుమానాస్పద మరణాలు జరగకుండా చూడాలని విద్యార్థులకు నాణ్యమైన ఆహారము విద్యను అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని,అధికారులను హెచ్చరించారు.మొన్నటి రోజున పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రాజారపు గుణాధిత్య తోటి విద్యార్థులతో కలిసి నేలపైన నిద్రపోయాడు.

అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆస్వస్థకు గురైన గుణాధిత్య వాంతులు చేసుకొని కుప్పకూలిపోయాడు.తోటి విద్యార్థులు కేర్ టేకర్కు విషయం తెలుపగా ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు.

Advertisement

విద్యార్థి తండ్రికి ఫోన్ చేయగా హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హాస్టల్ కి వచ్చి విద్యార్థిని తన ద్విచక్ర వాహనం పైన మెట్ పల్లి లోని ప్రభుత్వ దవాఖానకు తరలించడం జరిగిందని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడు అని నిర్ధారించారని అన్నారు .ఎనిమిదో తరగతికి చెందిన హర్షవర్ధన్, గణేష్ అనే విద్యార్థులు కూడా అస్వస్థకు గురయ్యారని వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లారని, గణేష్ నీ పరీక్షించిన వైద్యులు పాముకాటు వల్లే అస్వస్థకు గురయ్యారని తెలిపారని అన్నారు.గుణదిత్య కూడా పాముకాటుతోనే మరణించాడని వారి తల్లిదండ్రులు వాపోతున్నారని తన కొడుకు చదివి వాళ్లకు ఎదిగి వస్తాడనుకొని ఎన్నో ఆశలతో హాస్టల్ కి పంపిస్తే ఇంటికి శవమై వచ్చాడని దీనికి అధికారులు బాధ్యత వహించాలని అన్నారు.

పేద బలహీన వర్గాల విద్యార్థుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తుందని, విద్యార్థి మరణానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిని నియమించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అధికారులతో తనిఖీ నిర్వహించాలని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారికి సరియైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు నవీన్,కోడం వెంకటేష్, రుద్రవేణి సుజిత్, కోడి రోహిత్,సాయి, హర్షిత్, అరవింద్, తిరుపతి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సెస్ హెల్పర్ పిల్లలు సర్కార్ బడికి..
Advertisement

Latest Rajanna Sircilla News