యాదాద్రి జిల్లా:తెలంగాణ కాంగ్రేస్ పార్టీలో సీనియర్ నేత,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు పార్టీ మార్పుపై స్పందించారు.మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడాతూ తన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలతో సంబంధం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.
తాను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతానని ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు.
సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిశానని, భవిష్యత్తులోనూ ప్రధానిని కలుస్తానని వెల్లడించారు.కాంగ్రెస్లో ఉన్న అంతర్గత విభేదాలనేవి మొగుడు పెళ్లాల మధ్య గొడవ లాంటివని,అన్నీ వాటికవే సర్దుకుంటాయని అభివర్ణించారు.
సింగరేణి బొగ్గు గనులలో జరిగిన కుంభకోణంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ అభివృద్ధి కోసం తాను పోరాడుతూనే ఉంటానని, ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం,రైతుల పండించిన ధాన్యం కొనలేదా అని ప్రశ్నించారు.
సొంతంగా ధాన్యం కొనడానికి డబ్బులు లేవుకానీ,సెక్రెటేరియేట్,ప్రగతి భవన్,ఫామ్ హౌస్ నిర్మాణాలకు నిధులు ఎక్కడివని నిలదీశారు.కేసీఆర్ కు ధాన్యం కొనుగోలు చేయడం చేతగాకపోతే తనకు, రేవంత్ రెడ్డికి అప్పచెబితే మద్దతు ధరతో కొనుగోలు చేసి చూపిస్తామని సవాల్ విసిరారు.