అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి ఇప్పటికే ఎక్కడా అప్పు పుట్టడం లేదు.ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇక అప్పు ఇవ్వలేమని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
దీంతో సంక్షేమ పథకాల అమలు కోసం సర్కారు భూములను అమ్మాలని రాష్ట్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.దీనికి బిల్డ్ ఏపీ అనే పేరు కూడా పెట్టారు.
అయితే తాజాగా కొత్తగా అప్పు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంత సులువుగా అనుమతించేలా కనిపించడం లేదు.రాష్ట్రంలో ప్రజా ఖాతాల నుంచి నిధుల బదిలీ ద్వారా వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.15 వేల కోట్ల అప్పు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.అయితే అంత అప్పు ఎందుకు? అసలు ఇప్పటికే ఎంతో ఎక్కువ అప్పు చేశారని కేంద్రం ఓ లేఖలో బదులిచ్చింది.

2017-18 ఆర్థిక సంవత్సరం నాటికే రూ.2100 కోట్లు ఎక్కువ అప్పు చేశారని కేంద్రం స్పష్టం చేసింది.ప్రజా ఖాతాల నుంచి నిధుల బదిలీ ద్వారా ఇప్పటి వరకూ రూ.6709 కోట్ల రుణాలు చేయగా.2019-20 బడ్జెట్లో దానిని కేవలం రూ.1500 కోట్లుగా మాత్రమే ఎందుకు చూపించారంటూ కేంద్రం ప్రశ్నించింది.
2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ అప్పులను అంచనా వేయడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని ఆదేశించడం గమనార్హం.వీటికి సమాధానం వచ్చిన తర్వాతే ప్రజా రుణం ద్వారా రూ.15 వేల కోట్లు సమీకరించుకునేందుకు రాష్ట్రం కోరిన అనుమతిపై స్పందిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.