తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బ తీసి ఆ పార్టీని ఏకాకిని చేయడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ తన ఆలోచనలకు పదును పెడుతున్నారు.ఏపీలో తాను తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు వైసీపీకి కలిసొచ్చే కంటే టిడిపిని ఎక్కువ దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహారాలు నడిపిస్తూ టిడిపిని మరింత దెబ్బతీస్తున్నాడు.
ఏపీలో ఇప్పటికే అనేక ఇబ్బందులతో టీడీపీ నాయకులు సతమతమవుతున్నారు.అధికార పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొనసాగిస్తున్న రాజకీయ వేధింపుల కారణంగా ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు, కీలక నాయకులు పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
మరికొంతమంది ఈ తలనొప్పి ఎందుకులే అన్నట్టుగా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.ఈ వ్యవహారాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబుకు జాతీయ స్థాయిలోనూ దెబ్బ కొట్టే విధంగా జగన్ స్కెచ్ వేస్తున్నాడు.
ఎన్డీఏ కూటమికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతివ్వడం ద్వారా తమ రాజకీయ భవిష్యత్తు ఏ డోకా లేకుండా చూసుకోవడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయవచ్చు అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.మొన్నటి వరకు చంద్రబాబు ఎన్డీయేకు ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు.
వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ కలుపుకొని ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు.అందుకే కేంద్ర అధికార పార్టీతో సఖ్యత గా ఉన్నా విభేదించినా బాబు రాజకీయానికి అడ్డు అదుపు లేకుండా ఉండేది.
ప్రస్తుతం ఆ విధమైన రాజకీయం నడిపించలేకపోతున్నారు.

లోక్ సభలో ఆ పార్టీకి కేవలం ముగ్గురు సభ్యుల బలమే ఉంది.రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరిపోవడంతో తెలుగుదేశం పార్టీ పెద్ద బలమే కోల్పోయింది.ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి బలహీనమవుతూ వస్తోంది.
ఈ పరిస్థితులు బాబుకు నిద్ర పట్టనీయడంలేదు.అందుకే ఏదో ఒక రకంగా బీజేపీకి దగ్గరవడం ద్వారా మళ్లీ పునర్వైభవం తీసుకురావచ్చనే భావనలు చంద్రబాబు ఉన్నారు.
అందుకే అవసరం ఉన్నా, లేకపోయినా బీజేపీ అగ్రనేతలు మోదీ అదే పనిగా పొగుడుతూ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే వైసిపి బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో మద్దతు ప్రకటిస్తోంది.ప్రస్తుతం బీజేపీకి లోక్ సభలో బలం ఉన్నా రాజ్యసభలో బలం తక్కువగా ఉండడంతో జగన్ వారికి అండగా నిలుస్తూ వస్తున్నారు.
ఈ విధంగా చేయడం ద్వారా ఎన్డీయేకు దగ్గరయ్యే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నాడు.ఇక బీజేపీ కూడా ఏపీలో బలమైన పార్టీగా ఉండడం, ఎంపీల బలం ఎక్కువగా ఉండడంతో టిడిపి కంటే వైసీపీతోనే కలిసి ముందుకు వెళదాం అనే భావనలో ఉంది.
ఇది అధికారికంగా కనుక జరిగితే టిడిపి జాతీయ స్థాయిలోనూ ఒంటరి అయ్యే అవకాశం ఉంది.తద్వారా టిడిపి మరింత బలహీనం అవుతుందని జగన్ భావిస్తున్నారు.