వైకాపాకు బై సైకిలెక్కేందుకు మ‌రో ఎమ్మెల్యే సై

ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న‌ ప్రయత్నాలు ఫలించడంలేదు.

ఓ వైపు రైతుల కోసం మంటూ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ చేస్తున్న రైతు భ‌రోసా యాత్ర అనంత‌లో ఒడిదుడుకుల మ‌ధ్య సాగుతుంటే, వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు సిద్దం కావ‌టం ఆ పార్టీ శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌ని అంశ‌మే.

సోమ‌వారం రాత్రి పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి త‌న అనుచరులతో క‌ల‌సి టీడీపీలో చేరే విష‌య‌మై సుదీర్ఘ మంతనాలు జరిపిన‌ట్టు తెలిసింది.టీడీపీలో చేరితే త‌న రాజ‌కీయ‌ భవిష్యత్ కు భ‌రోసా ఏమిటో కూడా అమ‌ర్‌నాధ్ రెడ్డి వివ‌రించిన‌ట్లు సమాచారం.

పాల‌క పార్టీలో చేర‌టం వ‌ల్ల ఒరిగే ప్ర‌యోజ‌న‌ల‌తో పాటు పిఏసి చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి జ‌గ‌న్ త‌న‌నెలా మోసం చేసిందీ, తన అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది.అమ‌ర‌నాధ‌రెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు జ్యోతుల నెహ్రూ కీల‌క భూమిక పోషించిన‌ట్టు స‌మాచారం.

కాగా ఇటీవ‌ల మ‌హానాడు సంద‌ర్భంగా తెలుగుదేశంలో అమ‌ర‌నాధ‌రెడ్డి చేరుతార‌ని భావించినా, జ‌గ‌న్ నుంచి వ‌చ్చే స్పంద‌న చూసి, ఆపై మాట్లాడ‌తానంటూ చెప్ప‌డంతో దేశంలో చేరికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.కాగా సోమ‌వారం జ్యోతుల నేరుగా అమ‌ర‌నాధ‌రెడ్డితో మాట్లాడి బాబు ఇచ్చిన హామీ చెప్ప‌డంతో సైకిలెక్కేందుకు సై అన‌టం జ‌రిగింద‌ని, ఇందుకు కార్య‌క‌ర్త‌లు సైతం ఓకే చెప్పార‌ని తెలుస్తోంది.

Advertisement

అనుకున్న‌వ‌న్నీ ఓ రూపానికి వ‌స్తే, అమ‌ర‌నాథ‌రెడ్డి ఈ వారంలోనే ప‌చ్చ కండువా క‌ప్పించుకోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

పవన్ ప్లాన్ : పెద్ద నాయకులు టిడిపిలోకి ... చిన్న నాయకులు జనసేనలోకి 
Advertisement

తాజా వార్తలు