తౌటే తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.ప్రస్తుతం కేరళ తీరానికి సమీపంలో ఉన్న తౌటే మే 18న గుజరాత్ తీరాన్ని తాకనుంది.
ఒక్కో తుఫానుకు ఒక్కో పేరును పెడతారనే విషయం మనకు తెలిసిందే.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుకు మయన్మార్ ‘తౌటే’ అని పేరు పెట్టింది.
అసలు ఈ ‘తౌటే’ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? తౌటే(Tauktae) అంటే బర్మా భాషలో పెద్ద శబ్దం చేసే బల్లి అని అర్థం అట.ఈ తుఫాన్ కు పేరుపెట్టే అవకాశం ఈసారి మయన్మార్ కు లభించడంతో అక్కడి వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును ఈ తుఫాన్ కు పెట్టింది.బర్మా భాషలో తౌటే అంటే అధికంగా ధ్వనులు చేసే బల్లి అని అర్థం.
ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టే అవకాశం ఆసియా దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది.
ఈ పేరు పెట్టే కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి.ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏనీ, యెమెన్ దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి.2004 నుంచి ఈ ప్రాంతంలో తుఫానులకు పేరు పెట్టే విధానాన్ని అమలు చేస్తున్నారు.

తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ అల్లకల్లోలంగా ఉంది.తౌటే తుఫాన్ ప్రభావం ఎక్కువగా కేరళపై ఉన్నట్లు తెలుస్తోంది.ఇడుక్కి, పాలక్కాడ్, మల్లాపురం, త్రిశూర్, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసరఘడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాలు మోహరించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.త్రిశూర్ లో చాలా గ్రామాలు నీట మునిగాయి.ఈ తుఫాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్షను నిర్వహించారు.ఎన్డీఎంఏ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు ఎఫెక్ట్ ఉందని అధికారులు తెలిపారు.