బీహారులో ఎన్డీయే చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి గులాబీ పార్టీ నిజామాబాద్ ఎంపీ , ముఖ్యమంత్రి కూతురు కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.కొంతకాలంగా పలు సందర్బాలలో ఆమె కేంద్రాన్ని విమర్శించారు.
కవితలో మార్పును గుర్తించిన ప్రతిపక్షాలు కేంద్రంలో పదవి ఇవ్వక పోవడం వల్లనే కవిత మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆరోపించాయి.ముఖ్యమంత్రి కెసీఆర్ మోడీ మీదగానీ, కేంద్రం మీద గానీ విమర్శలు చేయడం లేదు.
కవిత తనకు తానై విమర్శలు చేస్తున్నారో, కెసీఆర్ చేయిస్తున్నారో తెలియదు.మొన్న ఈ మధ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 1.93 లక్షల ఇళ్ళు కేటాయించి, తెలంగాణకు 10 వేల ఇళ్ళు కేటాయించింది.దీనిపై కెసీఆర్ ఏమీ మాట్లాడలేదు.
కాని కవిత తెలంగాణకు అన్యాయం జరిగిందని తీవ్రంగా విమర్శించారు.అసహనం మీద పార్లమెంటులో జరిగిన చర్చలో పాల్గొన్న కవిత ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.
అసహనం అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం జవాబు చెప్పడం లేదన్నారు.దేశంలో జరుగుతున్న సంఘటనల మీద ప్రభుత్వం స్పందించడం లేదని కవిత అన్నారు.
దేశంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పార్లమెంటుకు హామీ ఇవ్వడానికి బదులు ప్రతిపక్షాల మీద దాడి చేస్తోందని విమర్శించారు.తెలంగాణాలో అసహనం లేదని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగడంలేదని అన్నారు.
ప్రజల సహనానికి తమ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకోవాలని కవిత అన్నారు.