ఏపీ రాజధాని అమరావతి విషయంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని బాధ్యత కేంద్రానికి ఉందని, అయినా తనకేమీ పట్ట పట్టనట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాల విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని, వెంటనే ఏపీ రాజధాని విషయం పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అమరావతి విషయంలో తప్పించుకునే ధోరణిని అవలంబిస్తున్నాయని, అసలు తమ విధానం ఏంటో కేంద్రం ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ముందుగా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి వారితో ఈ విషయంపై చర్చించాలని పవన్ సూచించారు.ఏపీ బీజేపీ నేతలు అమరావతి కి మద్దతుగా మాట్లాడుతుంటే, కేంద్ర నాయకులు మాత్రం ఈ వ్యవహారం తమకు సంబంధం లేదంటూ మాట్లాడుతున్నారని పవన్ అన్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని అమరావతి రైతులు కలిసినప్పుడు అమరావతి ఎక్కడికీ పోదని చెబుతున్నారని, వారు వెళ్లిపోయిన తర్వాత రాజధాని కేంద్రం పరిధిలోని అంశం కాదు అంటూ ప్రకటనలు చేస్తున్నారని, ఇదంతా తప్పించుకునే ధోరణి కదా అంటూ పవన్ విమర్శించారు.

మొత్తంగా ఈ వ్యవహారం చూస్తుంటే రాజధాని వ్యవహారం హీటు పెంచి బీజేపీ ని ఇరికించి తద్వారా వైసీపీని ఇబ్బంది పెట్టాలనేది పవన్ ప్రయత్నంగా కనిపిస్తోంది.అందుకే బీజేపీని ఇబ్బంది పెట్టేలా విభజన చట్టాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.అమరావతి నుంచి రాజధాని తరలించడానికి కుదరదంటూ కేంద్రం ఒక స్టేట్మెంట్ ఇస్తే జగన్ రాజధాని మార్పు ఆలోచనను పక్కన పెట్టి ఉండేవారని, కానీ కేంద్రం అలా చేయడం లేదంటూ మండిపడ్డారు.
రోజు రోజుకి ఏపీలో రాజధాని అంశం తీవ్రతరం అవుతోందని, వెంటనే ఈ విషయంపై ఏపీ ప్రజలకు న్యాయం చేయాలంటూ పవన్ డిమాండ్ చేస్తున్నారు.అయితే పవన్ వ్యాఖ్యలపై బిజెపి స్పందన ఎలా ఉంటుందో, ఆ పార్టీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.