నల్లగొండ జిల్లా: తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తమ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో దళితబంధు పై మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దళితులకు కూడా ఇచ్చామంటూ ఎమ్మార్పీఎస్ కొడుకులకు ఇచ్చామని మాదిగలను అవమానపరుస్తూ మాట్లాడిన బలుపు మాటలను తక్షణమే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.సోమవారం ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి ఆధ్వర్యంలో స్థానిక జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తుంగతుర్తిలో ప్రజలు విశ్వాసం కోల్పోయి అసహనంతో ఉన్న కిషోర్ ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను అవమాన పరుస్తున్నాడన్నారు.అహంకారం,బలుపు, అధికార మదం తగ్గించుకొని మాట్లాడకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అవినీతికి అక్రమాలకు, ఇసుక దందాకు,చిల్లర రాజకీయాలకు రాష్ట్రంలో కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడన్నారు.ప్రజా ప్రతినిధిగా హుందాగా మాట్లాడాల్సింది పోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక సాంబయ్య మాట్లాడుతూ…తుంగతుర్తిలో అత్యధిక ఓట్లు కలిగిన మాదిగలను అవమానించిన కిషోర్ కి వచ్చే ఎన్నికల్లో మాదిగలే రాజకీయ గోరి కడతారని హెచ్చరించారు.
దళిత బంధు పథకాన్ని అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని,దళిత బంధు ద్వారా దళితులకు ఇస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి గాదరి కిషోర్ ఇసుక దందాలో తీసుకున్న కమిషన్ నుండో కావనే సత్యం తెలుసుకోవాలని హితవు పలికారు.
తరతరాలుగా దోపిడీకి గురైన ప్రజలకు న్యాయబద్ధంగా చెందాల్సిన వాటిని ప్రభుత్వం ఇస్తుంది తప్ప, గాదరి కిషోర్ ఇంట్లో నుండి ఇస్తున్నవి కావన్నారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిముల్ల శంకర్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి గాదరి కిషోర్ ను భారత రాష్ట్ర సమితి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వొద్దని హెచ్చరించారు.గాదరి కిషోర్ ఎమ్మార్పీఎస్ నాయకులకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే గాదర్ కిషోర్ ను నియోజకవర్గంలో మాదిగలు అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి నాయకులు బొజ్జ దేవయ్య,మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, కందుల మోహన్, ముత్యాల శంకర్ రెడ్డి, ఇరుగు లక్ష్మయ్య,దుబ్బ సత్యనారాయణ, మాసారం వెంకన్న, తోరకొప్పుల రాజు,బొజ్జ నాగరాజు,బొజ్జ కృష్ణయ్య, ప్రభాకర్,గురుజ వెంకన్న, కృష్ణయ్య,అర్జున్,బొజ్జ నవీన్,ఏడుకొండలు, కత్తుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.