ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.
కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్నారు.
శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు.
విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు.తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు.
అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.
చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు.
చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారితో సినిమాలు నాన్న గారు కలిసి చేశారని వెల్లడించారు.ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు.ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని ” అన్నారు.