అమెరికా: జాగింగ్‌కు వెళ్లి శవమై తేలిన భారత సంతతి పరిశోధకురాలు

అమెరికాలో దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన పరిశోధకురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తున్న సర్మిస్త సేన్ ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ సమీపంలో జాగింగ్ చేస్తున్నారు.ఆ తర్వాత ఆమె మృతదేహం లెగసీ డ్రైవ్, మార్చమన్ వే సమీపంలోని క్రీక్ ప్రాంతంలో లభ్యమయ్యింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.సర్మిస్త హత్య కేసుకు సంబంధించి 29 ఏళ్ల బకారి అభియోనా మోన్‌క్రీప్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

సర్మిస్త హత్య జరిగిన సమయంలోనే మైఖేల్ డ్రైవ్‌లోని 3,400 బ్లాక్‌లోని ఓ ఇంటిలోకి ఎవరో చొరబడ్డారు.ఈ కేసులో బకారిని దోపిడి నేరం కింద అరెస్ట్ చేశారు.

Advertisement

దీంతో సర్మిస్త హత్యతో అతడికి సంబంధం వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.ప్రస్తుతం కొల్లీన్ కౌంటీ జైలు నిర్బంధంలో ఉన్న బకారిని పోలీసులు విచారిస్తున్నారు.43 ఏళ్ల సర్మిస్త సేన్ ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు.మాలిక్యూలర్ బయాలజీ విభాగంలో, క్యాన్సర్ రోగుల కోసం పనిచేశారు.

ఆమెకు ఇద్దరు కుమారులు.సహజంగానే అథ్లెట్ కావడంతో ఆమె ప్రతిరోజు తన పిల్లలు నిద్రలేవడానికి ముందే జాగింగ్ చేయడానికి వచ్చేదని పోలీసులు చెప్పారు.సర్మిస్త మరణంతో ఆమె కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు